ఏపీలో అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై ఇరు పార్టీల నేతలు తమ వాదన వినిపిస్తున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు మద్యం గురించే కాకుండా కరోనా నియంత్రణ చర్యలు, ముఖ్యమంత్రి సహాయనిధి గురించి కూడా విమర్శలు గుప్పిస్తూ మాట్లాడటం సరికాదని అన్నారు. మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో దేశంలోని అనేక రాష్ర్టాలలో మద్యం దుకాణాలకు పరిమితంగా అనుమతి ఇచ్చినట్లే రాష్ర్టంలో కూడా అమ్మకాలు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు.
``టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నాను. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నారు. హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు ఆ తుపాను పేరుతో ముఖ్యమంత్రి సహాయనిధికి కోట్లాది రూపాయల విరాళాలు సేకరించారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు,కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సేకరించారు. ఆ నిధులపై ఈరోజు వరకు కూడా లెక్కాపత్రం లేదు. జమా ఖర్చులు లేవు. ఎటు వెళ్లిపోయాయో, ఏమయ్యాయో తెలియదు. దమ్ము, ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు దీనిపై విచారణకు సిధ్దమేనా`` జోగి రమేష్ సవాల్ విసిరారు.
``ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి హుద్ హుద్ తుపాను సహాయర్ధం కొన్నిలారీలు,వెహికల్స్ పంపించారు. అవి ఏమయ్యాయో తెలియదు.దాన్లో ఉన్న సరుకు ఏమైపోయిందో తెలియదు. ఇలాంటి దగుల్భాజీ పనులు చేసిన మీరా....మా ప్రభుత్వాన్ని,మా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. అసలు అలా ప్రశ్నించే నైతిక అర్హత మీకుందా``అని తెలుగుదేశం పార్టీ నేతలకు జోగి రమేష్ సవాల్ విసిరారు. ``హుద్ హుద్ తుపాను వస్తే పేదలకు సహాయం చేయాలి.కాని పేదల పొట్ట కొట్టడం కోసం, వారిపేరుతో వసూలుచేసిన వందలకోట్ల రూపాయలు దండుకున్నారు. నీచసంస్కృతి గల చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను. మీకు దమ్ముంటే విచారణకు సిధ్దం కండి.`` అని జోగి రమేష్ సవాల్ విసిరారు.