విశాఖ నగరం  పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం లో ఉన్న ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు ఎంతో మంది ప్రజల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భారీ మొత్తంలో ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి విషవాయు వెలువడడం... ఏకంగా చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందడంతో... భారీ మొత్తంలో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇక ఈ విష వాయువు గాలిలో కలిసిపోవడంతో ప్రజలందరూ ఈ విష వాయువులు పీల్చుకుని  అచేతన  స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక ఈ విష వాయువు కారణంగా ఏకంగా  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం, తీవ్రమైన కళ్లమంటలు కడుపులో వికారం చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలతో ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. 

 

 

 ఇక ఈ రోజు తెల్లవారుజామున ఈ విష వాయువు భారీ మొత్తంలో వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ స్పృహ కోల్పోయారు. రోడ్లపై నడుస్తున్నవారు ఈ విష వాయువులు పీల్చుకుని  అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక ఇళ్లల్లో నిద్రిస్తున్న వారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు అక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ స్పృహ కోల్పోయిన వారిని వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఈ విష వాయువు   ప్రభావం ఎక్కువగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెంటనే ఆయా ప్రాంతాలను ఖాళీ చేసి  ఇతర ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. 

 

 దీంతో చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. కొన్ని ఇళ్ల తలుపులు ఎంతకీ తెర్చుకోక పోవడంతో పోలీసులు అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా.... నిద్రలోనే స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇలాగే వందలాది ఇళ్ల తలుపులు పగలగొట్టి నిద్రలో స్పృహ కోల్పోయిన వందలాది మంది ప్రజలను బయటకు తీసుకు వస్తున్నారు పోలీసులు. ఇదే సమయంలో అటు పోలీసులు కూడా కొంతమంది తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: