దేశంలో కరోనా రోగంతోనే చనిపోతున్నారంటే.. ఇప్పుడు విశాఖకు మరో ఉపద్రవం వచ్చిపడింది. తెల్లవారుజామున విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరగడంతో ఎక్కువ మందిపై ప్రభావం చూపించింది. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీని లాక్ డౌన్ తరువాత తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పరుగులు తీస్తున్న ప్రజలు రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు హృదయవిదారకంగా మారిపోయాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గ్యాస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చింది.. మనుషులు, పశుపక్ష్యాదులులు పిట్టల్లా రాలిపోతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. రోడ్డు పక్కన మురికి కాలువల్లో సైతం కొంత మంది పడి చనిపోయారంటే ఇది ఎంత దారుణంమైన రూపం దాల్చిందో అర్థమవుతుంది.
ఎక్కడ చూసినా రోదనలే వినిపిస్తున్నాయి. పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఎలా జరిగింది. ఎందుకు జరిగింది అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉన్నది. ప్రస్తుతం గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నది. పిల్లలు, మహిళలు, వృద్దులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. రసాయన వాయువు లీక్ అయిందన్న విషయం తెలుసుకున్న ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామస్తులు ఇండ్లలోనే ఉండిపోయారు. ఇండ్లలోనే చిక్కుకున్న వారి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాయువు ప్రభావంతో గంగరాజు అనే వ్యక్తికి కళ్లు కనబడకపోవడంతో.. బావిలో పడి చనిపోయాడు.
వందల సంఖ్యలో బాధితులను పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గ్రామాల్లో కట్టేసిన పశువుల పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది. ఎల్జీ పాలిమర్స్ లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పోలీసులు సైతం విష వాయువుల వలన అస్వస్థతకు గురవుతున్నారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు.