విశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరిగిపోతున్నాయి. లీకైన గ్యాస్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లోకి వ్యాపించింది. ఈ గ్యాస్ కారణంగా ఇప్పటికే 2000 మంది వరకు స్పృహతప్పి పడిపోయినట్టు సమాచారం. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఇంకా చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారని, వారంతా ఎలా ఉన్నారు అనే విషయం తెలియడం లేదని, అసలు బతికున్నారా లేదా అన్నది అనుమానమే అని స్థానికులు చెప్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరగడంతో ఎక్కువ మందిపై ప్రభావం చూపించింది. సౌత్ కొరియాకు చెందిన ఈ కంపెనీని లాక్ డౌన్ తరువాత తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నది. పిల్లలు, మహిళలు, వృద్దులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. 'విశాఖలోని ఓ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని షాక్ అయ్యాను. ఆపదలో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకోవడానికి తెలుగు దేశం పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలి. అధికారులు సూచిస్తోన్న జాగ్రత్తలను అక్కడ వారంతా పాటించాలని నేను కోరుతున్నాను' అని చంద్రబాబు అన్నారు.
మరికొద్ది సేపట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు విశాఖకు చేరుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ ప్రజలను కదిలిస్తే కన్నీరే సమాధానం చెబుతుంది..ఇలాంటి పరిస్థితుల్లో వారిని రాజకీయ నేతలు ఎలా ఓదారుస్తారు.. ఎలా ధైర్యం చెబుతారు అన్నది తెలియాలి. కానీ ఇది ఓ భయంకరమైన దుర్గటన అంటూ రాజకీయ నేతలు పార్టీలతకు అతీతంగా సానుభూతి తెలుపుతున్నారు.