విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా చుట్టుపక్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇప్పటికే సుమారు 10మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టెర్లిన్ గ్యాస్ బాగా ఘాటుగా ఉండటంతో.. కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోవడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారిపోయింది. అసలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ఈ కంపెనీ విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో దాదాపు 219 ఎకరాల్లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 1978లో దీనిని యూబీ గ్రూప్ తీసుకుంది. ఆ తర్వాత 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్జీ గ్రూప్(ఎల్జీ కెమికల్స్) తీసుకుని ఎల్జీ పాలిమర్స్గా పేరు మార్చింది.
థర్మాకోల్, ఇతర ప్లాస్టిక్ వస్తువుల లాంటివి ఇందులో తయారు చేస్తారు. అయితే.. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగడంతో కంపెనీ కార్యకలాపాలను నిలిపివేశారు. అయితే.. కంపెనీ మెయింటనెన్స్ కోసం ప్రభుత్వం ఏకంగా షిప్టులవారీగా 45మంది సిబ్బందికి ప్రత్యేక పాస్లు కూడా ఇచ్చింది. ఇప్పటికే కంపెనీలో దాదాపు 2వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్ నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. లాకడౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలింపుల్లో భాగంగా పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. దీంతో తెల్లవారుజామున కంపెనీని ప్రారంభించే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైందని అధికారులు చెబుతున్నారు. అయితే.. స్టైరెన్ నిల్వలో 20డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటనెన్స్ చేయడంలో కంపెనీ విఫలం చెందడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. కంపెనీలో ఆటో బ్లాక్ను, సైరెన్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ రోజు విషాద ఘటన జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.