ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో ? ఈ మహమ్మారికి ఎప్పుడు మందు వస్తుందో ? కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 220 దేశాల్లో కొన్ని లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇక మన దేశంలో సైతం కరోనా పాజిటివ్ కేసులు 50 వేలకు అతి సమీపంలో ఉన్నాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకున్నా అదంతా లాక్ డౌన్తో పాటు చాలా కఠినమైన రూల్స్, సామాజిక దూరం పాటించడం.. వ్యవస్థలను అన్నింటిని కంట్రోల్ చేయడంతోనే సాధ్యమైందని చెప్పాలి. అయితే రేపు అయినా ఆ తర్వాత అయినా ఈ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయక తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే మళ్లీ మనుష్యులు అందరూ కలిసి ఎవరి పనులు వారు చేసుకోవాలి.. ఈ ఉరుకు పరుగులు జీవితంలోకి ప్రవేశించాలి.
ఇక ఓ వైపు కరోనాను కట్టడి చేసేందుకు మందు లేదా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల్లో కొన్ని వేల పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్కు వ్యాక్సిన్ రాకపోతుందా ? అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చడంతో ఇప్పుడు వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసలు కరోనాకు ఇప్పట్లో మందు లేదా వ్యాక్సిన్ కనుగోవడం జరిగే పని కాదన్న సందేహం వ్యక్తమవుతోందని స్వయంగా డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త డేవిడ్ నబారో తెలిపారు. వ్యాక్సిన్ తయారీ అంటే మాటలు కాదని దానికి ఎన్నో దశలు ఉంటాయని వివరించారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే నాలుగు దశల్లో ఈ వ్యాక్సిన్ను ప్రయోగించాలని... నాలుగో దశలో కూడా ఎన్నో రకాల వ్యాధులు ఉన్న వ్యక్తులపై ప్రమోగిస్తామని ఆ తర్వాత ఓకే అనుకున్నాకే దీనిని అమల్లోకి తీసుకు వస్తామని చెప్పారు. ఆయన ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాధులు అయిన డెంగ్యూ, హెచ్ఐవీ, ఎయిడ్స్కు సైతం మందు కనుక్కోలేదని.. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పారు.
ఇక ఎయిడ్స్తో ప్రతి సంవత్సరం ఏకంగా 3.2 కోట్ల మంది మరణిస్తున్న విషయాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో ఏం చేయలేమని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధే చేసిన వ్యాఖ్య ప్రపంచాన్ని వణికిస్తోంది.