భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 50 వేల మార్క్ ను దాటాయి. కేరళలో తొలి పాజిటివ్ కేసు నమోదైన నాలుగు నెలల తర్వాత ఈ మార్క్ ను భారత్ దాటింది. మొత్తం కేసుల సంఖ్య 50,545కి చేరుకుంది. గత మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 10 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా మహారాష్ట్రలో జరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ అత్యధికంగా 1, 233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఆందోళన కలగకమానదు. రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు రోజుకు 3 వేల కేసుల వరకు బయటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యా ఐదు వేలకు పెరిగింది. దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనది. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్ లలో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అహ్మదాబాద్లో గురువారం అర్ధరాత్రి నుంచే సంపూర్ణ లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ లాక్ డౌన్ సీరియస్ గా పాటిస్తున్నారు.
మిగతా రాష్ట్రాల విషయాలను దృష్టిలో పెట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సూరత్లో శనివారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది. ఈ సంపూర్ణ లాక్ డౌన్ లో కేవలం మెడికల్ షాపులు, పాల దుకాణాలు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. ఈ సంపూర్ణ లాక్డౌన్ ను విజయవంతం చేయడానికి సీఎం విజయ్ రూపానీ ప్రత్యేక అధికారులను నియమించారు.