వైసీపీ నాయకురాలు రోజా అంటేనే ఫైర్ బ్రాండ్.. ఆ విషయం తెలుసుకదా.. ఇప్పుడు ఆమెకు మరోసారి విపరీతంగా కోపమొచ్చింది. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆమె ఘాటుగానే స్పందించారు. ఇంతకీ టీడీపీ నేతలు ఏమన్నారు.. ? ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై జగన్ సర్కారు గట్టిగా చర్యలు తీసుకోలేదట.. సరిగ్గా కేసులు పెట్టలేదట. ఈ ఫ్యాక్టరీని తరలిస్తామని ఆదేశించలేదట.. ఇవీ.. టీడీపీ ఆరోపణలు..
కానీ అసలేం జరిగింది. దుర్ఘటన విషయం తెలిసిన దగ్గర్నుంచీ సీఎం జగన్ చాలా దూకుడుగా వ్యవహరించారు. సహాయక చర్యలపై దృష్టిసారించారు. ఆ పరిశ్రమకూ గట్టిగానే షాకులిచ్చారు. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఏకంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఆ సంస్థపై కేసులు పెట్టారు.. ఇలా ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి వంకలేకుండా పని చేస్తే.. టీడీపీ నాయకులు విమర్శించడంతో రోజా మండిపడ్డారు.
టీడీపీ నేతలు గ్యాస్ దుర్ఘటనపై కూడా చీప్గా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్ ఈ ఘటనపై హైపవర్ కమిటీతో విచారణకు ఆదేశించారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. యాజమాన్యంపై కూడా పోలీసు కేసు నమోదయ్యిందన్నారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని రోజా నిప్పులు చెరిగారు.
అంతే కాదు.. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులున్నారని.. ఆంధ్రప్రదేశ్కు మాత్రం మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని రోజా పేర్కొన్నారు. అందుకే ప్రజల కష్టాలను చూసి చలించిపోయారని.. ఎన్నడూలేని విధంగా రూ.కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. గ్యాస్ లీకేజీ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పరిహారాన్ని చూసి అన్ని పార్టీలు అభినందిస్తున్నాయని రోజా అన్నారు.