ఈ మధ్యకాలంలో మద్యం అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకోవాలనుకునే వారు పెరిగి పోతూనే ఉన్నారు. దీని కోసం ఎన్నో దారులను వెతుకుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కానీ ఎట్టకేలకు పోలీసులకు దొరికి కటకటాల పాలవుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి. ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఎవరిలో భయం మాత్రం కనిపించడం లేదు. యథేచ్ఛగా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు.తాజాగా జరిగిన ఘటనతో అయితే పోలీసులు కూడా షాక్ అయ్యారు.
కారుపై చూస్తే పోలీస్ స్టిక్కర్ ఉంది... ఆ కారుకు ఒక నకిలీ నెంబర్ ప్లేట్ ఉంది... ఇక టోల్ గేట్ వద్ద మేము డిపార్ట్మెంట్ మనుషులం మమ్మల్ని ఆపుతారా అంటూ దబాయింపు. కానీ కారు లోపల మాత్రం ఫుల్లుగా లిక్కర్ బాటిల్స్ . అయితే ఇలా కారుకు పోలీస్ స్టిక్కర్ వేసుకొని నకిలీ నెంబర్ పెట్టుకున్న కారుతో మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరానికి చెందిన భరత్ గౌడ్, కుషాయిగూడ కమల నగర్ కు చెందిన వెంకటేశ్వరరావు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి... టాటా సఫారీ వాహనంలో లాక్ డౌన్ నిబంధనలతో కట్టడి గా ఉన్న ప్రాంతాలలో తిరుగుతున్నారు.
అంతేకాదు తాము డిపార్ట్మెంట్కు చెందిన వాళ్లం అని చెబుతూ టోల్ ఫీజు కూడా చెల్లించడం లేదు. ఇక తాజాగా సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు కీసర పరిధిలోని చెక్పోస్ట్ వద్ద ఈ వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ నకిలీది అని గుర్తించారు పోలీసులు. ఆ కారు విశాఖపట్నానికి చెందిన ఒక వ్యక్తిదిగా తేల్చారు. అయితే స్నేహితుడైన విశాఖపట్నానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి నుంచి అవసరం నిమిత్తం మూడు నెలల పాటు కారుని తీసుకొని... దానికి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చి... అక్రమ మద్యం రవాణా చేస్తున్నట్లు... గుర్తించిన పోలీసులు.. యువకులను కీసర పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.