విశాఖలోని ఆర్ ఆర్ వెంటకాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విషవాయువును పీల్చుకోవడం వల్ల వందలాదిమంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. 12మంది మృతి చెందారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టింది. బాధితకుటుంబాలకు కూడా భారీ మొత్తంలో పరిహారం ప్రకటించి 24గంటలలోపే విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విశాఖలో పరిశ్రమలను తొలగించాలని, జనావాసాలమధ్య పరిశ్రమలు ఉండొద్దని, వెంటనే వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనపై పలువురు విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు పరిశ్రమలు లేకుంటే విశాఖే లేదని, పరిశ్రమల వల్లే విశాఖకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందని, వందలు, వేలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అది మహానగరంగా మారుతోందని అంటున్నారు.
దేశంలోని టాప్ టెన్ సిటీల్లో విశాఖపట్నం ఒకటిగా నిలుస్తుందని, ప్రశాంత వాతావరణానికి నిదర్శంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగినంత మాత్రాన పరిశ్రమలను తొలగించాలంటూ డిమాండ్ చేయడంలో అర్థం లేదని వారు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ పరిశ్రమలను తొలగిస్తే.. వందలు, వేలాదిమంది ఉపాధికోల్పోయి కుటుంబాలన్నీ రోడ్డున పడుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే.. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అనుమతులు ఇచ్చేటప్పుడు కూడా ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ప్రమాదాలు జరిగినా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిశ్రమలను తొలగించాలని వస్తున్న డిమాండ్ అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఓవైపు కరోనా దెబ్బనుంచి కోలుకోవడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్శించి, స్థానికంగా పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను నెలకొల్పాలని ఆర్థికనిపుణులు సూచిస్తున్న విషయాన్ని మనం గుర్తించాలని సూచిస్తున్నారు.