తెలంగాణాలో కరోనా పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని విపక్షాల చేస్తోన్న ఆరోపణలకు హైకోర్టు వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది . రాష్ర్టంలో కరోనాపరీక్షలు ఎందుకు సరిగ్గా నిర్వహించడం లేదని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు నేరుగా ప్రశ్నించడం ... గత నెలరోజులుగా టిఆరెస్ సర్కార్ పై విపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదన్న నిర్ధారణ కు సామాన్యులు వచ్చేలా చేసింది . రాష్త్రం లో కరోనాపరీక్షలు సరిగ్గా నిర్వహించకపోగా , కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు .
అయితే బిజెపి తోపాటు , కాంగ్రెస్ ఇతర విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై టిఆరెస్ నాయకత్వం , ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదురుదాడి చేశారు . విపక్ష నేతలనుద్దేశించి జోకర్లు , బఫున్లు అంటూ ముఖ్యమంత్రి విమర్శలు చేయగా ఆయన మంత్రివర్గ సహచరులు సైతం అదే తరహా విమర్శలకు తెగబడ్డారు . ఇప్పుడు హైకోర్టు సైతం రాష్ర్టంలో కరోనాపరీక్షలు నిర్వహించటం లేదని , కేసులు తక్కువ చేసి ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించిందని , ముఖ్యమంత్రి , మంత్రులు హైకోర్టు పై ఎదురుదాడి చేస్తారా ? అంటూ బిజెపి సీనియర్ నేత , ఎమ్మెల్సీ రామచందర్ రావు ప్రశ్నించారు . విపక్షాలు నిజాలు చెబితే జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు , హైకోర్టు అంక్షింతలతోనైనా మేల్కొని రాష్ర్టంలో కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహించాలని డిమాండ్ చేశారు .
రాష్ట్రం లో కరోనా టెస్టుల నిర్వహణ పై ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కూడా తప్పుదోవ పట్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు . ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ , రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వ బృందాన్ని పంపించాలని కోరారు . అయితే రాష్ట్రం లో కరోనా టెస్టులు తక్కువగా నిర్వహిస్తున్నట్లు విపక్షాలు చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు . అయితే విపక్షాల ఆరోపణల్ని బలపర్చేవిధంగా , ఇప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది .