ప్రస్తుతం టిడిపి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు వయసు రీత్యా మరికొద్ది రోజుల్లో రిటైర్ మెంట్ తీసుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తర్వాత ఆయన వారసుడిగా, ఆయన తనయుడు నారా లోకేష్ పేరు ప్రస్తావనకు వస్తుంది. అంతేకాకుండా భావి ముఖ్యమంత్రిగా కూడా లోకేష్ పేరు పదేపదే ప్రస్తావనకు వస్తుంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీలోనూ లోకేష్ ప్రాధాన్యం పెంచారు చంద్రబాబు. లోకేష్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా గత టిడిపి ప్రభుత్వంలో ఐటి , పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఇప్పుడే ఒక కొత్త విషయం కొంతమంది టిడిపి నాయకులు బయటపెట్టారు.
అది ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు లోకేష్ కు అస్సలు ఆసక్తి లేదని, చంద్రబాబు బలవంతం తోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారనే విషయాన్ని వారు చెబుతున్న మాట. ప్రస్తుతం లోకేష్ వ్యవహారం చూస్తుంటే అది నిజమే అన్నట్టు గా అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే వారు ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయంగా పై మెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. ప్రజల తరఫున ప్రజా ఉద్యమాలు పోరాటాలు చేస్తూ, మంచి పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు.
ప్రతి సందర్భంలోనూ ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ లోకేష్ ఆ దిశగా వెళ్లడం లేదని టిడిపి అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా పోరాటాలు చేయాల్సిందిగా చంద్రబాబు లోకేష్ కి ఎన్ని సార్లు ఒత్తిడి తెచ్చినా, లోకేష్ ప్రవర్తన మారడం లేదని, ఆయన ఇంకా మానసికంగా చిన్న పిల్లాడిలా భావిస్తూ ఆ విధంగా వ్యవహరిస్తున్నారని, దీని కారణంగా లోకేష్ అసమర్థుడు అనే భావన ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ వచ్చిందని కొంతమంది ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం లోకేష్ చంద్రబాబుతో పాటు ఆయన తన సొంత నివాసంలో లోనే ఉంటున్నారు. ఈ సమయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కాబోయే టిడిపి అధ్యక్షుడిగా లోకేష్ ఏపీ రాజకీయాల్లో పోరాటాలు చేయాల్సి ఉన్నా ఆయన మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా ... కరోనా సమయంలో సైకిల్ పై రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తుండడం టిడిపి శ్రేణులు కూడా మింగుడు పడడం లేదు.
ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను ప్రత్యేక అనుమతి కోరుతూ ఏపీలో ఆయన పర్యటించే అవకాశం ఉన్నా ఆ దిశగా మాత్రం ఆయన అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలో టిడిపి పగ్గాలు లోకేష్ కు అప్పగిస్తే ఆ పార్టీ పూర్తిగా చతికిల పడుతోంది అనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. అసలు లోకేష్ కు రాజకీయాలపై ఆసక్తి లేదన్నట్టు గాని వ్యవహరిస్తున్నారు.