కరోనా కలకలం నేపథ్యంలో దేశశ్యాప్తంగా విధించిన లాక్ డౌన్తో జనజీవనం తీవ్రంగా ప్రభావితం అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ముగుస్తుందా అనే ఉత్కంఠలో ప్రజలు ఉన్నారు. లాక్ డౌన్ తర్వాతి పరిస్థితులపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీలకమైన ప్రజారవాణ విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే, 18వ తేది నుంచి కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే, ఇందులో అనేక షరతులు ఉండనున్నాయని తెలుస్తోంది.
ఏపీలో ప్రజా రవాణను అందుబాటులోకి తేవడంతో పాటుగా కరోనా వైరస్ వ్యాప్తిని సైతం అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. బస్సులలో 50 శాతం సీట్లలో మాత్రమే ప్రయాణీకులను అనుమతించనున్నారని సమాచారం.దీంతో పాటుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బస్ టిక్కెట్లు ఇస్తే కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించింది. అయితే, టికెట్ల విషయంలో ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో, కరెంట్ రిజర్వేషన్, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది టిక్కెట్లను విక్రయించనున్నారు.
దీంతో పాటుగా బస్సులను అంతర్ జిల్లా సర్వీసులుగానే నడపనున్నారు. నాన్ ఏసీ బస్సుల విషయానికి వస్తే 150 కిలో మీటర్లకు పైగా దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్లు మాత్రమే ఉంచనున్నారు. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్లైన్ రిజర్వేషన్లు ఉంటాయి. పల్లె వెలుగు బస్సులకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తంగా ఇటు ఆర్టీసీ బస్సులను ప్రజల కోసం అందుబాటులోకి తెస్తూనే మరోవైపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్న ఈ నిర్ణయాలు త్వరలోనే ప్రభుత్వ ఆదేశాలుగా వెలవడనున్నట్లు సమాచారం. రాబోయే వారంలో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.