లాక్ డౌన్...అందరి జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఇక ప్రేమ పక్షులకు ఇంట్లో కట్టిపారేసినట్లే. మరోవైపు.. కొత్త ప్రేమల లెక్కలు మారుతున్నాయి. లాక్డౌన్ వల్ల నాలుగు గోడలకే పరిమితమైన ఒంటరి పక్షులు ప్రేమ కోసం ‘ఆన్లైన్' బాట పట్టారు. లాక్డౌన్తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. తోడు కోసం డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో షాకింగ్ లెక్కలు బయటపడుతున్నాయి.
లాక్ డౌన్ సమయంలో డేటింగ్ యాప్లలో మారుతున్న లెక్కలే ఇందుకు నిదర్శనం. ఒంటరితనంలో ఓదార్పును కోరుకునేవారు సైతం ఈ యాప్ల బాట పడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో అన్ని డేటింగ్ యాప్లలో జంటగా మారిన వారి సంఖ్య సగటున 10-15 శాతం పెరిగింది. లాక్డౌన్లో కొత్త వినియోగదారుల సంఖ్య 20% పెరిగిందని ఆయా సంస్థలు చెప్తున్నాయి. దీనికి తగ్గట్లే సేవలు సైతం మారుస్తున్నాయి. ప్రముఖ డేటింగ్ యాప్ అయిన టిండర్ ‘పాస్పోర్ట్', ఒకే క్యూపిడ్ యాప్ ‘ఎనీవేర్' ఫీచర్లు దీనికి ఉదాహరణలు. సాధారణంగా డేటింగ్ యాప్లలో మనం ఉన్న నగరానికి చెందిన వ్యక్తులతో మాత్రమే పరిచయం పెంచుకునే పరిమితులు ఉండేవి. కానీ.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ల ద్వారా మనకు నచ్చిన దేశంలో, నచ్చిన నగరంలో మన లొకేషన్ను సెట్ చేసుకోవచ్చు. తద్వారా అక్కడి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. లాక్డౌన్ కాలంలో పాస్పోర్ట్, ఎనీవేర్ ఫీచర్లు వాడేవారి సంఖ్య భారత్లో 25 శాతం పెరిగిందని ఆయా సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా విదేశీ వ్యక్తుల పరిచయాలు కోరుకునే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు చెప్పాయి.
ఫ్లోష్, సిర్ఫ్ కాఫీ, మైస్కూట్ వంటి స్టార్టప్ సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. చాటింగ్లకే పరిమితం కాకుండా జూమ్ యాప్తో జతకట్టి ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఫీజు చెల్లించిన వినియోగదారులు ఇంట్లో కాఫీ కప్పు చేతిలో పట్టుకొని జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనవచ్చు.