ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బీతావహులను చేస్తున్న కరోనా మహమ్మారి ఆటకట్టించే పనలు వేగంగా సాగుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతున్న తరుణంలో వైరస్ ఈ పని పట్టేందుకు సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా హాంకాంగ్ శాస్త్రవేత్తలు మరో కొత్త మార్గం కనుగొన్నారు. వివిధ దేశాల పరిశోధకులు కరోనా పేషెంట్లకు లోపినవిర్ – రిటానవిర్ అనే యాంటీ వైరల్ మందుతో కొందరు డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. దీనికి తోడుగా తాజాగా చేస్తున్న పరిశోధనలు ఫలించినట్లైతే, కరోనా ఖేల్ ఖతమే.
ప్రస్తుతం ఇస్తున్న రెండు యాంటీ వైరల్ మందులకు మరో రెండు యాంటీ వైరల్ డ్రగ్స్ ను కాంబినేషన్ గా మార్చి వాడితే.. మంచి ఫలితాలు వస్తాయని హాంకాంగ్ యూనివర్సిటీ సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. పరిశోధనలో భాగంగా హాంకాంగ్లోని ఆరు హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న 127 మంది పేషెంట్లకు ఈ కొత్త పద్ధతిని ఉపయోగించారు. లోపినవిర్– రిటానవిర్తో పాటు ఇంటర్ ఫెరాన్ బీటా 1బీ, రిబావిరిన్ అనే మరో రెండు మందులను కలిపి యాంటీ వైరల్ డ్రగ్ కోంబోను ప్రయోగించారు. దీంతో ఈ మూడు మందులు కలిపి తీసుకున్న పేషెంట్లలో ఏడు రోజుల్లోనే సింప్టమ్స్ తగ్గిపోయినట్లు గుర్తించారు. వీరి దేహాల్లో కరోనా వైరస్ కణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. ఈ ట్రీట్ మెంట్ తో పేషెంట్లు హాస్పిటల్ లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా తప్పుతుందని సైంటిస్టులు తెలిపారు. అయితే, ఈ పద్ధతిని మితంగా, స్వల్పంగా అనారోగ్యంతో ఉన్న పేషెంట్లకు మాత్రమే ఉపయోగించామని, సీరియస్ పేషెంట్లలో కూడా ఈ మందులు బాగా పనిచేస్తాయా? లేదా? అన్నది తెలుసుకునేందుకు భారీ ఎత్తున ఫేజ్ 3 ట్రయల్స్ చేయాల్సి ఉందని తెలిపారు.
కాగా, మన దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ప్రభావంతో కొత్తగా 128 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62,779కి పెరిగింది. ఇప్పటివరకు 2208 మంది మృతిచెందారు. దేశంలో 41,472 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, ఈ వ్యాధి బారిన పడిన 19,358 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.