విశాఖ అంటేనే ప్రముఖ నగరం. విభజన తరువాత దానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖ ఒకే ఒక అతి పెద్ద నగరంగా మారింది. దేశంలో ఎవరైనా అంధ్రా వైపు చూడాలంటే విశాఖ ఒక్కటే మార్గంగా ఉండేది. ఆసియా ఖండంలోనే అతి వేగంగా అభివ్రుధ్ధి చెందుతున్న సిటీగా ఉన్న విశాఖకు ఈ మధ్యన వరసగా శాపాలు తగులుతున్నాయి.
ఒక విధంగా విశాఖకు దిష్టి తగిలిందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఎందుకంటే వైసీపీ సర్కార్ విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని అంటోంది. అతి ముఖ్యమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతోంది. అటువంటి సమయంలో విశాఖ పేరు జాతీయ స్థాయిలో మరో మారు నానింది.
సరిగ్గా ఈ టైంలో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఘటన జరగడంతో విశాఖ ఇమేజ్ కి కొంత వరకూ డ్యామేజి జరిగిందన్న భావన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే విశాఖలో తుఫాన్లు వస్తాయని, హుదూద్ వంటి భారీ తుఫాన్లు కనుక వస్తే నగరానికి సేఫ్ అన్నది లేదని ఇక్కడ రాజధానిని అడ్డుకుంటున్న వారు గట్టిగా చెబుతూ వచ్చారు. రాజధానికి విశాఖ అనుకూలం కాదని, అమరావతినే రాజధానిని చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఇపుడు వారికి గొంతు పెరుగుతోంది. విశాఖలో గ్యాస్ లీకేజ్ తరువాత దాన్ని మరింతగా పెంచి పెద్దది చేయడం వెనక రాజకీయ శక్తులు బాగా పనిచేస్తున్నాయని అంటున్నారు. విశాఖలో గ్యాస్ లీకేజి ఈ నెల 7న తెల్లవారు జామున జరిగింది. అయితే అదే రోజు రాత్రి దాన్ని పెంచి పెద్దది చేశారు. మొత్తానికి మొత్తం గ్యాస్ ట్యాంకర్లు పేలిపోతాయని, ఇక విశాఖ బూడిద అని కూడా భయపెట్టారు. బెదరగొట్టారు.
రాత్రులంతా జనం జాగారం చేసారు. దీని వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. . అదే విధంగా విశాఖకు చెందిన వైసీపీ నేతలు కూడా ఒక దుర్ఘటనను రాజకీయం చేయడం తగదని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖలో నీరు విషం అయింది. గాలి విషం అయింది. అసలు విశాఖే టోటల్ గా విషతుల్యం అంటూ ఇప్పటికీ రాతలు రాస్తున్న వారున్నారు. జనాలను బెదరగొడుతున్నవారు ఉన్నారు.
నిజానికి భోపాల్ ఘటనకు,విశాఖ ఘటనకు కూడా ఎక్కడా పోలిక లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక మెయింటెయిన్ లోపం వల్లనే ప్రమాదం జరిగింది తప్ప మరేమీ కాదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా దీన్ని అడ్డం పెట్టుకుని విశాఖకు రాజధాని రాకుండా అడ్డం కొట్టాలన్న ఆలోచనతోనే కొన్ని శక్తులు రాజకీయం చేస్తున్నాయని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.