కరోనా వైరస్ రోజు రోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభిస్తుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలె ఈ వైరస్ వ్యాప్తి మరింతగా వేగవంతమయింది. ప్రజలు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా ఈ వ్యాధి సోకుతుంది. మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడం అలాగే ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉండటం వల్ల మాత్రమే ఈ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం. లేదంటే ఈ ప్రమాదకర వ్యాధికి మందు కూడా లేదు. ఇప్పటి వరకు దీని వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలు ఎంత గానో పరిశోధనలు చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీని నివారణ చర్యలు మాత్రం చేపట్టడం చాలా కష్టతరంగా మారింది.
ఇక ఇదిలా ఉంటే ఇటీవలె దీన్ని ప్లాస్మా థెరపీ ద్వారా కాస్త నయం చేయవచ్చని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వ్యాధి బారిన పడి కోలుకోలేని స్థితిలో ఉన్న వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ప్లాస్మా చికిత్స మొదలుపెట్టనున్నారు. అయితే ఈ చికిత్సకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఆసుపత్రిలో అన్నీ కూడా పూర్తి చేశారు. ఇక ఐసీఎంఆర్ అనుమతితోనే ప్లాస్మా థెరపీ చేసేందుకు వైద్య సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇక గతంలో ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న 15 మంది పేషెంట్లు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వారే కాకుండా మరో 200 మంది తమ ప్లాస్మా ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీంతో ప్లాస్మా థెరపీ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులో ఉన్న యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. ఈ యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి వైరస్ ఏదైతే ఉందో దాంతో ఫైట్ చేస్తాయి. ఇక ఈ ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ అనేది ఒకరి నుంచి మరొకరికి మ్యాచ్ అవ్వాలి. అలాంటి డోనర్స్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇక అలాంటి డోనర్స్ అవసరం ఎంతైనా ఉంది.
కాగా, తెలంగాణలో నిన్న 33 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపుగా 26 మంది ఉన్నారు. వలస కూలీలకు కూడా ఏడుగురికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రోజు రోజుకి వ్యాధి విజృంభిస్తుందేకాని ఎక్కడా తగ్గడం మాత్రం కనిపించడం లేదు.