కరోనా కారణంగా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ప్రపంచమంతా ఒక్కసారిగా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. కేవలం నిత్యవసర వస్తువుల కోసం మాత్రమే బయటకు రావలసి వస్తుంది. ఇక వలస కూలీల పరిస్థితి అయితే వర్ణణాతీతం అని చెప్పాలి. ఉండడానికి నిలువ నీడలేదు. తినడానికి తిండి లేక ఇక వారి ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏమి చెయ్యాలో కూడా అర్ధం కాని పరిస్థితుల్లో పొట్ట చేత పట్టుకుని తమ వెంట తెచ్చుకున్న బట్టలు, పిల్లలను తీసుకుని కాలి నడకన తమ గూటికి చేరుకోవడానికి బయలు దేరుతున్నారు. ఇక వారి ప్రాంతాల వరకు చేరే లోపే కొంత మంది అలసట వచ్చి రోడ్డు మీదే ఓ పక్కన తలదాచుకుంటుంటే వారికి అక్కడా సుఖం ఉండడం లేదు. ఎప్పుడు చీకట్లో ఏబండి కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటామో అన్న భయం.
ఇక ఇదిలా ఉంటే... రేపటి నుంచి వీటన్నిటికి తెరపడనుంది. మంగళవారం నుంచి పలు రైళ్లను నడపున్నట్లు భారత రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక లాక్డౌన్ ప్రకటించగానే ప్రపంచమంతా కూడా ఎక్కడికక్కడ రవాణా శాఖ మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే కాస్త కదిలాయి. అయితే వలస కూలీల కోసం ఇటీవల రైళ్లను కదిలించారు. ఇంతలోనే ప్యాసింజర్ రైళ్ల కదలికకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మంగళవారం నుంచి దేశంలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు కదలబోతున్నట్లు సమాచారం. అయితే మొత్తం మీద 15 డజన్ల రైళ్లు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం.
ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రధాన నగరాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణించనున్నాయట. అయితే రైళ్లలో ప్రయాణించే వారు మాత్రం కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేని యడల దానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు. అవేమిటంటే.. టికెట్లను కౌంటర్ లో అమ్మరు. స్టేషన్ కు వెళ్లి టికెట్ కొని ప్రయాణించే అవకాశాలు ఉండవు. కేవలం ఐఆర్సీటీసీ ద్వారా మాత్రం ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ ఆప్షన్ ఉండనుంది.
అలాగే స్టేషన్లో వైద్య పరీక్షలు కూడా ఖచ్చితంగా నిర్వహిస్తారు. దానికి అందరూ కంపల్సరీగా సహకరించాలి. దాని కోసం ప్రయాణికులు ముందుగానే స్టేషన్కి రావలసి ఉంటుంది. కరోనా తరహా లక్షణాలు ఉన్న వారిని రైలు ఎక్కడానికి అనుమతించరు. మొత్తానికి ఏదోలా ఇలా ప్రయాణాలను ప్రారంభించడానికి ట్రయల్ రన్ గా దేశంలోని అన్ని రైల్వే జోన్లలోనూ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.