క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల అవ‌స్థ‌లు ఎన్నో. వాటిలో హృద‌య విదార‌క‌మైన‌వి కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ వలస కార్మికుల కష్టాలను రెట్టింపు చేస్తోంది. చేసేందుకు పనిలేక, ఇంటికి వెళ్లాంటే సరైన రవాణా వసతులు లేక ఇంటి బాట పట్టిన కార్మికులను కరోనాకు తోడు.. విధి కూడా వారిని వెక్కిరిస్తూనే ఉన్నది. ఎలాగైనా సొంతూరికి చేరుకోవాలనుకుంటున్న వారు మర్గమధ్యలోనే అనంత లోకాలకు వెళ్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘ‌ట‌న‌లు మ‌న హృద‌యాల‌ను క‌ల‌చి వేశాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కూలీలు రోడ్ల‌పై, రైల్వే ట్రాక్‌ల‌పై న‌డుచుకుంటూ స్వంత రాష్ట్రాల‌కు వెళ్తుండ‌టాన్ని నిరోధించాల‌ని కోరింది.

 


ఇటీవ‌ల జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదం, అనేక మంది కార్మికులు రోడ్డు వెంట మృత్యువాత ప‌డ‌టం, దారిలో క‌న్నుమూయ‌డం వంటి ఉదంతాల నేప‌థ్యంలో వ‌ల‌స కూలీలు ఎవ‌రూ రోడ్డు మార్గంలో కానీ, రైల్వే ప‌ట్టాల‌పై న‌డిచి వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.  కార్మికులంతా స్పెష‌ల్ రైళ్ల‌లో వెళ్లే మార్గాల‌ను ఎంచుకోవాల‌న్నారు. ఎక్కువ సంఖ్యలో శ్రామిక్ రైళ్ల‌ను న‌డిపేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హ‌క‌రించాల‌ని హోంశాఖ కోరింది. 

 


ఇదిలాఉండ‌గా, తాజాగా ఓ కార్మికుడు తుది శ్వాస విడిచారు. లాక్‌డౌన్‌తో ఢిల్లీలో చేసేందుకు పనులు లేకపోవడంతో తన స్వస్థలానికి సైకిల్‌తో బయల్దేరాడు బీహార్‌కు వలస కార్మికుడు 26 ఏండ్ల సఘీర్‌ అన్సారి. ఢిల్లీ నుంచి బీహార్‌లోని తన సొంతూరైన తూర్పు చంపారన్‌కు వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం ఉంటుంది. మే 5న తన ఏడుగురు స్నేహితులతో సైకిల్‌పై బయల్దేరాడు. సగం దూరం చేరుకోవడానికి వారికి ఐదు రోజులు పట్టింది. శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి సమీపంలో అల్పాహారం కోసం ఆగారు. రోడు మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని టిఫిన్‌ చేస్తుండగా లక్నో నుంచి వస్తున్న కారు ఒక్కసారిగా వారిపై దూసుకొచ్చింది. దీంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఏడుగురు చిన్నచిన్న గాయాలతో తప్పించుకున్నారు. ఓ ఎన్‌జీవో సహకారంతో చికిత్స కోసం దవాఖానకు తరలిస్తుండగానే అన్సారి మృతిచెందాడు. కారు డ్రైవరును అరెస్టు చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అన్సారి మృతదేహాన్ని అంబులెన్సులో వారి స్వస్థలానికి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: