ప్రాణాంతక మహమ్మారి కరోనాను ప్రపంచానికి అంట గట్టిందనే ఆరోపనలు ఎదుర్కుంటున్న పొరుగు దేశం చైనా...తన పొగరు మాత్రం తగ్గించుకోవడం లేదు. వుహాన్లో ఈ వ్యాధిని పుట్టించిందననే నిందను అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలుకొని అభివృద్ధి పథంలో సాగుతున్న ఆస్ట్రేలియా వంటి దేశాలచే సైతం ఎదుర్కుంటున్న ఈ డ్రాగన్ కంట్రీ తాజాగా కరోనా వైరస్ విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో చైనా విఫలమైందని, సకాలంలో సమాచారం అందించలేదని, అసలు వైరస్ చైనా ల్యాబ్లోనే తయారైందని, అమెరికా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చైనా క్లారిటీ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ను చైనా కావాలని వ్యాపింపజేసిందని సైతం ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది. చైనా చేసిన 24 ఆరోపణలకు స్పందనగా 30 పేజీల సుదీర్ఘ ఖండనను చైనా విదేశాంగశాఖ వెబ్సైటులో పోస్టు చేశారు. అమెరికా చేస్తూ వచ్చిన ఆరోపణలకు సవివరంగా అందులో సమాధానమిచ్చారు. వూహాన్ ల్యాబులో వైరస్ తయారు చేశారనే ఆరోపణను విదేశాంగశాఖ వెబ్సైటులో పెట్టిన వ్యాసంలో తీవ్రంగా ఖండించారు. అసలు ఆ ల్యాబుకు వైరస్ను తయారు చేసే సామర్థ్యం లేదని, పైగా ప్రపంచంలో వ్యాపిస్తున్న వైరస్ మనుషులు తయారు చేసింది కాదని లభిస్తున్న సాక్ష్యాధారాలను ఉదహరించారు. చైనా కంటే ముందే అమెరికాలో కరోనా వ్యాపించిందనే కామెంట్ చేయడం గమనార్హం.
కాగా, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్యింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనా కోవిడ్-19 మహమ్మారికి గురైన మొదటిదేశాల్లో ఒకటని చెప్పారు. అమెరికా పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నందున వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం అని ఆమె తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తదితరులు ఈ మధ్యన తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారని, వాటిల్లో చైనాపై అనవసరంగా విరుచుకుపడుతున్నారని ఎద్దేవా చేశారు. 'సత్వరం స్పందించలేదని, సమాచారం సమకూర్చలేదని, చైనాను జవాబుదారీగా నిలిపేందుకు దర్యాప్తులు జరగాలని ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఈ అంశాలపై చైనా తన వైఖరిని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తోంది` అని గుర్తుచేశారు. ఎప్పుడు ఏం జరిగిందో వివరాలు వెల్లడిస్తే అది వదిలిపెట్టి సంఖ్యల మీద పడ్డారు. ఇతరుల సంఖ్యలు మనకన్నా బాగుంటే వారు అబద్ధాలు చెప్తున్నట్టు కాదు కదా` అని ప్రశ్నించారు.