రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ కూడా తెలియని లీడర్.. ఇటీవ ల లాక్డౌన్ కాలంలో పేదలకు బియ్యం పంపిణీ పేరుతో హల్ చల్ చేసిన నాయకుడు.. ఇప్పుడు ఒక్కసారిగా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిపోయారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి తొలిసారి విజయం సాధించిన బియ్యపు మధుసూదన రెడ్డి. నిజానికి లాక్డౌన్లో ఆయన పదివేల కిలోల బియ్యం పంచేవరకు, ఇది వివాదాస్పదం అయ్యే వరకు ఆయన పేరు బహుశ చిత్తూరు పాలిటిక్స్లో కూడా పెద్దగా వైరల్ కాలేదు. ఈ ఘటన వివాదం కావడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అయ్యా రు. అయితే, తాజాగా ఇప్పుడు మరోసారి ఆయన సెంట్రిక్గా రాజకీయాలు నడుస్తున్నాయి.
నేరుగా ఆయన చేసిన టార్గెట్ చూసి సీనియర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీలో సీనియర్ నేత, రాజకీయంగా కూడా అనేక పదవులు అలంకరించిన నాయకుడు.. ఒకప్పుడు ఆయన చేసిందే శాసనంగా నడిచిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణనే మధు టార్గెట్ చేయడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది. విషయంలోకి వెళ్తే.. మంత్రి బొత్స కేంద్రంగా తాజాగా మధు రెచ్చిపోయారు. పేరు ఎత్తకుండానే బొత్సను కడిగేశారు. ఆయన చూస్తున్న మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖను చెడమడా తిట్టిపోశారు మధు.
ఈ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నిప్పులు చెరిగారు. మునిసిపల్ శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. మరీముఖ్యంగా ఈ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా గాడితప్పిందన్నారు. నిజానికి ఓ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే.. అంతవరకే మాట్లాడాల్సిన మధు.. ఇలా ఓవరాల్గా మొత్తం శాఖకే ఎసరు పెట్టేలా వ్యాఖ్యలుచేయడం సర్వత్రా విస్మయాన్ని సృష్టించింది. మధు అంతటితో ఆగలేదు.. మున్సిపల్ శాఖలో సమూల మార్పులను తీసుకుని రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మున్సిపల్ శాఖలో ఇంజినీరింగ్ విభాగం ఎందుకు పనిచేస్తోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని పట్టాలెక్కించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఇస్తోన్న ప్రాధాన్యత కంటే.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారికి కల్పించాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ప్రక్షాళన ఏదో తన నియోజకవర్గం నుంచే ఆరంభించాల్సి ఉంటుందని చెప్పారు. పట్టణ స్థాయిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసిందని, అయిన ప్పటికీ.. ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి మురిగిపోతున్నాయని విమర్శించారు.
మంచినీటి కుళాయిల కనెక్ష న్లు సహా వాటి మరమ్మతులను పట్టించుకోవట్లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆ విభాగం అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఇలా మొత్తంగా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇందులో మరో కోణం ఏంటంటే.. కొత్తగా గెలిచిన మధు ఇలా ఒక సీనియర్ నాయకుడిపై రెచ్చిపోవడం ఏంటనేది?! పైగా తన నియోజకవర్గంలో సమస్యలను రాష్ట్రం మొత్తానికి ఆపాదించి.. రాష్ట్రం మొత్తంలోనూ ఇదే జరుగుతోందన్నట్టుగా మాట్లాడడం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.