విశాఖ గ్యాస్ ప్రమాదం తర్వాత ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఊహించని చర్యలతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు దగ్గర విమర్శలు చేసేందుకు కూడా సరైన మాటలు లేవు. అసలు చంద్రబాబు ఈ ప్రమాదంపై ఏదైనా కౌంటర్ ఇచ్చినా బాధితులే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇక ఈ ప్రమాదంపై చంద్రబాబు ఏదేదో నిజ నిర్దారణ కమిటీ అంటూ ఓ కమిటీ వేశారు. ఈ కమిటీలో నగరంలో ఉన్న నలుగురు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించ లేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు కమిటీలో స్థానం కల్పించకుండా… శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్పతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడు కు చోటు కల్పించారు.
స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గణబాబును చంద్రబాబు పక్కన పెట్టడమే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించిన గణబాబు, ఆ తర్వాత ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సాయం భేషుగ్గా ఉందని ప్రశంసించారు. గణబాబు ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం చంద్రబాబుకు నచ్చలేదని టాక్. అందుకే ఈ కమిటీలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ను పక్కన పెట్టి ఏకంగా పొరుగు జిల్లాల ఎమ్మెల్యేలకు చంద్రబాబు చోటు కల్పించారు.
అలాగే అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తోటి ఎమ్మెల్యేల దగ్గర సీఎం జగన్ పని తీరుపై ప్రశంసలు కురిపించారు. క్షేత్రస్థాయిలో ప్రతి పనిలోనూ పక్కా గా సమాచారం తెలుసుకున్నాకే ఆయన స్పందిస్తున్నారని.. ఇలాంటి నాయకుడి అవసరం ఉందని గణబాబు కితా బు ఇచ్చారు. ఇక ఇప్పుడు విశాఖలో ప్రమాదం జరగడం... ప్రభుత్వ పనితీరు ను కూడా ఆయన మెచ్చుకోవడంతో సహజంగానే బాబుకు నచ్చలేదంటున్నారు. ఇక గణబాబు సైతం టీడీపీలో ఇమడ లేకపోతున్నారట. ఆయన్ను విజయ సాయి రెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారని.. ఆయన ఎప్పుడైనా మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలోకి జంప్ చేయవచ్చని అంటున్నారు.