భారత్లో మతమార్పిడి కొత్తేమీ కాదు.. అనేక శతాబ్దాలుగా హిందువులు ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారడాన్ని మాత్రమే ఎక్కువగా చూస్తున్నాం. ఆనాడు ఇస్లాం రాజులు భారత్పై దండెత్తి, హిందూమతం నుంచి ఇస్లాంలోకి మతమార్పిడికి పాల్పడినట్లు చరిత్ర చెబుతోంది. ప్రధానంగా హిందూమతానికి చెందిన మహిళలను వివాహం చేసుకుని, మతం మారితేనే.. కుటుంబాలను ఆదుకుంటామని అప్పటి రాజులు చెప్పడంతో పెద్దసంఖ్యలో హిందువులు ఇస్లాంలోకి మారారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బ్రిటిష్పాలకులు భారత్లోకి వచ్చాక హిందువులను క్రైస్తవంలోకి మార్చారు. ఇదొక నిరంతర ప్రక్రియగా సాగింది. మతం మారితే.. చదువు నేర్పుతాం.. ఆర్థిక సాయం అందిస్తాం.. అంటూ మతమార్పిడికి పాల్పడ్డారు. మరోవైపు కొందరు ప్రజలు స్వచ్ఛందంగానే హిందూమతం నుంచి ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారారు. అయితే.. మత మార్పిడిలకు సంబంధించి దేశంలో అనేక మార్లు వివాదాస్పదం అవుతూనే ఉంది. ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.
తాజాగా.. ఇందుకు భిన్నంగా హర్యానా రాష్ట్రంలో ఒక ఘటన చోటు చేసుకుంది. హర్యానా రాష్ట్రంలోని ఇసార్ జిల్లా బిద్మిర్యా గ్రామంలో దాదాపు 40 కుటుంబాలకు చెందిన 200మంది ముస్లింలు ఇస్లాంలో నుంచి హిందుత్వంలోకి మారారు. ఇటీవలి కాలంలో ఖననానికి సంబంధించిన విషయం తదితర కారణాలతో తాము ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారినట్లు వారు చెప్పడం గమనార్హం. అంతేగాకుండా.. తమ బిడ్డలు చరిత్రనంతా చదివారని, తాము ఇక్కడ పుట్టిన వాళ్లమేనని, తమ పూర్వీకులు హిందువులేనని అందుకే తిరిగి వచ్చామని ఆయా కుటుంబాలు చెబుతున్నాయి. తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, తాము స్వచ్ఛందంగానే వచ్చామని ఆయా కుటుంబాల సభ్యులు చెప్పడం గమనార్హం. ఇక్కడ మరొక వాదన కూడా వినిపిస్తోంది. వారిని బలవంతంగా ఇస్లాం నుంచి హిందుత్వంలోకి మార్చారని పలువురు వామపక్షవాదులు, తదితరులు విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు మంచివికావని, భవిష్యత్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని మరికొందరు అంటున్నారు. ముందుముందు ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.