తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కృష్ణా నీటి వివాదం ముదురుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు నీటి త‌ర‌లింపుపై త‌మ‌దైన వాద‌న‌లు వినిపిస్తున్నారు. అయితే, తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీనియ‌ర్ అధికారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ ఏపీ స‌ర్కారు తీరుపై స్పందించారు. పొరుగు రాష్ర్టాలతో కలిసిమెలిసి ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించేలా ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 203ను విడుదల చేసింది అని పేర్కొన్నారు.

 

ఏపీ ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టు వల్ల తాగు, సాగునీటికి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందని  ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. `మొత్తం 8 టీఎంసీలకు ప్రపోజల్‌ పెట్టారు. సంగమేశ్వర పాయింట్‌ నుంచి 3 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని జీవోలో పేర్కొన్నారు. ఏపీ కొత్త ప్రాజెక్టులు ఆపాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం తరపున నిన్న లేఖ రాశాం. అవసరమైతే నేరుగా కలిసి ఏపీ ప్రాజెక్టుపై వివరణ ఇస్తాం. టెలిమెట్రి పెట్టాలని గతంలోనే కేఆర్‌ఎంబీని కోరాం.. ఇప్పటికి ఎలాంటి చర్యలు లేవు` అని రజత్‌ కుమార్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర  విభజన చట్టం ప్రకారం 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌లో కృష్ణా జలాల కేటాయింపుల అంశం పెండింగ్‌లో ఉందన్నారు. కృష్ణా జలాల పరిష్కారం కాకముందే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరి అని ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కాగా, ఏపీ స‌ర్కారు ప్రాజెక్టుల‌ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వ వైఖ‌రిని ర‌జ‌త్ కుమార్ వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: