అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాలో మరో అంతుచిక్కని వ్యాధి ఆ దేశ ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. అందులోనూ కరోనా విలయం కొనసాగిన న్యూయార్క్లోనే ఈ వ్యాధి తన ప్రతాపం చూపుతోంది. చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపే ఓ అంతుచిక్కని వ్యాధి న్యూయార్క్ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. న్యూయార్క్ వ్యాప్తంగా 100 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడగా... వ్యాధి లక్షణాలు ముదరడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
న్యూయార్క్ ఆరోగ్య విభాగం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపే ఓ అంతుచిక్కని వ్యాధి న్యూయార్క్ నగరంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో 16 శాతం కేసులు నమోదవుతున్నాయని న్యూయార్క్ అధికారులు వెల్లడించారు. కొందరు పిల్లల్లో కరోనా సోకిన ఆరు వారాల తర్వాత ఈ అంతుచిక్కని వ్యాధి లక్షణాలను గమనించినట్లు తెలిపారు. పిల్లల్లో జ్వరం, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకురావాలని, పరిస్థితి విషమిస్తే పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని న్యూయార్క్ ఆరోగ్య విభాగం అధికారులు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కవాసాకీ డిసీజ్ లేదా టాక్సిక్ షాక్ లక్షణాలను పోలి ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్హైస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 20 ఏళ్లల్లో ఐదు రకాల వైరస్లు చైనా నుంచే వచ్చి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయని, ప్రస్తుత కరోనా కూడా చైనా నుంచే వచ్చిందని ఆరోపించారు. గత 20 ఏండ్లలో చైనా నుంచి సార్స్, ఎవియన్ఫ్లూ, స్వైన్ఫ్లూ, కొవిడ్-19లాంటి భయంకర వైరస్లు చైనా నుంచి పుట్టుకొచ్చాయని దుయ్యబట్టారు. ప్రపంచ దేశాలు ఇదే విషయాన్ని ప్రస్తావించినా చైనా మాత్రం ఏమాత్రం బాధ్యత వహించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించి కట్టడి చేసే సామర్థ్యం చైనాకు ఉన్నా వారు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలా పట్టించుకోకపోవడం వల్లనే కరోనా విజృంభించి 2.50 లక్షల మందికి పైగా చనిపోవడానికి కారణమైందన్నారు.