ఒక సూక్ష్మ జీవి మనిషి మనుగడకే సవాల్ విసురుతోంది. ప్రతీ రంగంపై కరోనా పంజా విసురుతూ తన విశ్వరూపం చూపిస్తోంది. ఇలాంటి సమయంలో లాక్డౌన్ నుంచి ఒక్కో రంగానికి మినహాయింపు లభిస్తోంది. ఇప్పటికే మద్యం షాపులు తెరిచారు. సందట్లో సడేమియా అన్నట్లుగా పబ్బులు, బార్లు ఓపెన్ చేయడానికి పావులు కదుపుతున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తే కరోనా విశ్వరూపాన్ని చూడాల్సివస్తుందని WHO హెచ్చరిస్తోంది.
ఇప్పటికే మద్యం షాపులు తెరిచారు. బార్లు, పబ్బులు తెరవడానికి ఆలోచనలు చేస్తున్నారు. చుట్టూ హోరెత్తించే సంగీతం..! మసక మసక చీకట్లో ఎవరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒళ్లు తెలియని స్థితిలో పబ్బుల్లో ఊగుతూ తూగుతూ తిరుగుతుంటారు పార్టీ లవర్స్. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇలాంటి చోట భౌతిక దూరమనేదే ఉండదు. మద్యం షాపులతోనే సమస్యలనుకుంటే.. పబ్బులతో ఇబ్బందులు మరింత జఠిలం కానున్నాయ్. సోషల్ డిస్టన్స్కి ఇసుమంతైనా విలువ ఇవ్వని పబ్బులు తెరిస్తే ఇంక అంతే సంగతులు. కరోనా విసురుతున్న విషపు వలలో కచ్చితంగా చిక్కుకున్నట్టే.
పబ్బులంటేనే తొక్కిసలాట..! చుక్క పడిందంటే పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. సోషల్ డిస్టన్స్ అంటే కనీసం 6 అడుగులు దూరంగా ఉండాలి. అయితే, పబ్బుల్లో, క్లబుల్లో అంగుళం కూడా దూరం ఉండదు. పక్కన ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్ధితి కూడా ఉండదు. ఇలాంటి వాతావరణం ఉండే పబ్బులు, బార్లు తెరిస్తే మహమ్మారికి ఛాన్స్ ఇచ్చినట్టే.
సోషల్ డిస్టెన్స్కి పూర్తి వ్యతిరేకమే పబ్. ఇలాంటి పబ్లకు అనుమతివ్వకూడదు. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో పబ్లకు సడలింపులు ఇచ్చి.. కరోనా సెకండ్ వేవ్ మొదలవ్వడానికి కారణమయ్యారు. అలాంటిది హైదరాబాద్లో పబ్లు ఓపెన్ చేసి... భాగ్యనగరాన్ని మరో అమెరికా, స్పెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక్కసారిగా పబ్బులు, బారులు ఓపెన్ చేస్తే.. ఇన్నాళ్లు కరోనా కట్టడికి ప్రభుత్వాలు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది..