రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపడి కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. అయితే.. ఒక్క విషయంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా.. ఏపీ సీఎం జగన్ ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతుబంధు పథకం వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకం అనే చెప్పొచ్చు. రైతులు పెట్టుబడి కోసం తిప్పలు పడకుండా.. వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్లకుండా ఉండేందుకు స్వయంగా ప్రభుత్వమే పెట్టబడి సాయంగా ఏడాదికి రెండుపంటలకు కలిపి రూ.10వేల అందిస్తోంది. ఈ పథకం రైతులకు ఎంతో భరోసాగా నిలిచింది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడంలో ఈ పథకం అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. అయితే.. కౌలు రైతులకు మాత్రం సీఎం కేసీఆర్ పంటపెట్టబడి పథకాన్ని వర్తింపజేయలేదు. అలాగే.. స్థానికంగా రైతులకు అండగా ఉడేందుకు రైతు సమన్వయ సమితులను కూడా ఏర్పాటు చేశారు.
అయితే.. ఏపీ సీఎం జగన్ మాత్రం వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రూ.13500ను పంటపెట్టుబడిగా అందిస్తున్నారు. అంతేగాకుండా.. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు కూడా రూ.13,500 సాయం అందుతుంది. ఈ వర్గాలకు చెందిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. 18వ తేదీ నుంచి విత్తనాల విక్రయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులు కరోనా విపత్తుతో ఇబ్బంది పడకుండా 15 నుంచే నగదు జమను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే రైతన్నలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 2019–20 రబీ సీజన్ నుంచి ‘వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభించారు. అయితే.. స్థానికంగా రైతులకు అండగా నిలిచేందుకు, వారికి అవసరమైన అన్ని పనులు చేసిపెట్టేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.