తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. నిత్యం అధికార టీఆర్ఎస్ పాలనపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై, మంత్రి కేటీఆర్పై విరుచుకుపడడం మరం చూస్తూనే ఉంటాం. అయితే.. ఈసారి ఆయన రెచ్చిపోయింది మీడియా మీద. మీడియా మీద ఆయనకెందుకు కోపం వచ్చిందని అనుకుంటున్నారా..? మీడియాలో ఒకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను అస్సలే చూపిండంలేదట. అందుకే తనదైన శైలిలో రేవంత్రెడ్డి కేకలు వేశారు. ఒకరకంగా బెదిరింపులు పాల్పడ్డారని కూడా చెప్పొచ్చు. మీడియాలో ఒక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను చూపించడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కనీసం రెండు మూడు నిమిషాల సమయం కూడా ఇవ్వడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ఒక వర్గం ప్రతిపక్షాలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అధికార టీఆర్ఎస్ కు 50 శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 30 శాతం ఓట్లు వచ్చాయని, ఈ విషయాన్ని మీడియా మరిచిపోవద్దని ఆయన హెచ్చరించారు.
మీడియా తీరుపై త్వరలోనే నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తోందని, అయినా మీడియాలో ఒక వర్గానికి అది కనిపించడం లేదని, నాయకుల మాటలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్షాల వార్తలకు మీడియాలో ఎంతవరకు ప్రాధాన్యమిచ్చారో రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలని చురకలు అంటిస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గొంతును ఎలా నొక్కారో ఆయనకు తెలియదా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అదంతా మరిచిపోయి.. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఇక రేవంత్రెడ్డి తీరుపై సొంతపార్టీ నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.