ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోలేమా.. ఎంతో మందిని మంచాన్ని పట్టించి.. ప్రాణాలు హరించేలా చేస్తున్న ఈ వైరస్ కోరలు విరిచేయలేమా.. త్వరలోనే ఈ రాక్షస వైరస్ అంతు చూసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైరస్ పై సమర శంఖం పూరించారు ఆక్స్ ఫర్డ్ సైంటిస్ట్ లు. కోతులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తుండటంతో శాస్త్రవేత్తల్లో ఒకింత ఆశలు రేకెత్తుతున్నాయి.
కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవలే కోతులపై చేసిిన ప్రయోగాలు సత్ఫలితాలివ్వడంతో ప్రయోగాలు మరింత ఉత్తేజంగా పనిచేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను ఇవ్వడంతో కోతుల్లోని రోగ నిరోధక శక్తి ప్రాణాంత వైరస్ ను అడ్డుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతేకాదు ప్రతికూల లక్షణాలు ఏమీ కనిపించలేదని వెల్లడించారు.
ఒక వ్యాక్సిన్ డోసే ఊపిరితిత్తులు దెబ్బతినకుండా అడ్డుకుందని, ఇతర అవయవాలపై వైరస్ తీవ్రత తగ్గించిందని పరిశోధకులు తెలిపారు. కరోనాకు గురిచేసినప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో వైరస్ లక్షణాలు కన్పించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మానవుల్లో వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందో, ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం మనుషులపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్కు ఈ ఫలితాలు మద్దతుగా నిలుస్తున్నాయి. మనుషులపై ఫలితాలు రావాల్సి ఉంది. వ్యాక్సిన్ విజయవంతమైతే ఏడాది చివరికల్లా 100 మిలియన్ డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటీష్ డ్రగ్స్ కంపెనీలు వెల్లడించాయ్. బ్రిటన్లో టీకా ట్రయల్స్ విజయవంతమైతే కెన్యాలో ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరాలని ఆక్స్ఫర్డ్ భావిస్తోంది. సైటింస్ట్ ల కష్టానికి ప్రతిఫలం దక్కితే లక్షలాది ప్రాణాలను నిలిపిన వారిగా ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు.
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఇప్పటి నుంచే కాదు.. కొన్ని ఏళ్ల నుంచి ఏ వైరస్ చెలరేగినా దాన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇపుడు కరోనా వైరస్ వంతు వచ్చింది.