కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రబుత్వం క్రమంగా సడలింపులు ఇస్తుండడంతో పలు రంగాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా కొన్ని రంగాల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫారిన్ పోస్టాఫీస్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. విదేశాలకు సరుకుల రవాణాపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయడంతో 15 దేశాలకు ఇంటర్నేషనల్ మెయిల్స్ను అనుమతిస్తున్నారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ పోస్ట్లు, అత్యవసర వస్తువులు, ఔషధాల ఎగుమతులకు అనుమతినిస్తూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. ఇందులోభాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, జపాన్, కువైట్, మలేషియా, ఫిలిప్పీన్స్, సౌదీఅరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, శ్రీలంక, చైనా (రిపబ్లిక్), కొరియా (రిపబ్లిక్), థాయ్లాండ్ దేశాలతో అత్యవసర లావాదేవీలు కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు.
ఈ మేరకు మాసబ్ట్యాంక్లోని హుమాయూన్నగర్ ఫారిన్ పోస్టాఫీసులో వీదేశాలకు అత్యవసర సరుకుల ఎగుమతిని ప్రారంభించినట్లు హైదరాబాద్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఫారిన్ పోస్టాఫీసుల్లో అత్యవసర సేవలను పునరుద్ధరించి పార్శిల్లను ఢిల్లీకి చేరవేస్తున్నామని, అక్కడ నుంచి ఆయా దేశాలకు విమానాల్లో వాటిని చేరవేసేందుకు తపాలాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజుతో లాక్డౌన్ 3.0 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాక్డౌన్4.0 కొత్తగా ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే.. లాక్డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.