దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రారష్ట్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, గుజరాత్తోపాటు ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు గత మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పాస్లు జారీ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.
శనివారం నాటికి మహారాష్ట్రలో 29,100 మందికి కరోనా సోకగా, 1,068 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్లో 9,931 మందికి కరోనా సోకగా, 606 మంది మరణించారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, మరణాల రేటులో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న వారికి పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పొరుగునే ఉన్న ఏపీలో 2,307 మందికి కరోనా సోకగా, 48 మంది మృతి చెందారు. అయితే.. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఏపీ నుంచి రావాలనుకుంటున్న వారికి సైతం పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటం కూడా ఓ కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, లాక్డౌన్ కారణంగా లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. స్వరాష్ట్రానికి తిరిగి రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు పాసులు జారీ చేసేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇందులో 100 మంది అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కంట్రోల్ రూం ద్వారా 17,500 పాసులు జారీచేయగా, 80 వేల మంది తెలంగాణకు తిరిగి వచ్చారు. ఒక్కో పాస్ ద్వారా ముగ్గురు, నలుగురు వ్యక్తులకు సైతం అనుమతిస్తున్నారు. కంట్రోల్ రూం నంబర్లు(040–23450624)లకు రోజూ 2 వేల కాల్స్ వస్తుండగా, రోజుకు సగటున 500–600 పాసులు జారీ చేస్తున్నారు. పాస్ కోసం కాల్ చేసిన వ్యక్తులు తెలంగాణవాసులేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్న విషయాలను రుజువు చేసుకున్న తర్వాతే వాట్సాప్ ద్వారా పాస్లు జారీ చేస్తున్నారు.