భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు అధికమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే లక్షకు చేరువలో కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో మరణాలు కూడా అధికంగానే సంభవిస్తున్నాయి. అయితే ఇటీవల భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు లాక్ డౌన్ కఠినంగా అమలు చేశారని, కేసుల సంఖ్య అధికమవుతున్న కొద్దీ లాక్ డౌన్ సడలింపులు ఎక్కువగా ఇస్తున్నారని ఈ మెసేజ్ యొక్క సారాంశం. భారత్లో అంతర్మథనం పేరుతో ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. * 500 కేసులు ఉన్నపుడు .. లాక్డౌన్ కఠినంగా అమలు, *5000 కేసులకు చేరినప్పుడు.. అందరు చప్పట్లు కొట్టారు, *10000 కేసులకు చేరినప్పుడు.. అందరు దీపాలు వెలిగించారు, *40000కు కేసులు చేరినప్పుడు.. ఆకాశంలో పూలు జల్లారు, *50000 కేసులకు చేరినప్పుడు.. మద్యం దుకాణాలు తెరిచారు, 60000 కేసులకు చేరినప్పుడు.. రైలు ప్రయాణాలు మొదలెట్టారు, ఇప్పుడు 90000 కి చేరాయి... *సందిగ్ధంలో పడ్డ ‘కరోనా’... *భారత్లో నన్ను చూసి బయపడుతున్నారా? లేక పండగ చేసుకుంటున్నారా?* అంటూ మెసేజ్ ముగిసింది.
లాక్డౌన్ ఒకటో దశలో ఉన్నంత సీరియస్ నెస్ రెండో దశలో లేదని, రెండో దశలో ఉన్నంత సీరియస్ నెస్ మూడో దశలో లేదని, ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే నాలుగో దశ లాక్ డౌన్లోడ్ ఏ మాత్రం సీరియస్ ఉండదనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అందుకు తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తలూపుతున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్4.0 కొత్తగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన విషయం తెలిసిందే. కొత్తగా ఉండడం అంటే మొత్తంగా నిబంధనలను సడలించడమేనని సోషల్ మీడియాలో సెటైర్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులతో అనేక రాష్ట్రాలు మద్యం అమ్మకాలను చేపట్టాయి. షాపుల ముందు మందు బాబులు హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాజిక దూరం పాటించకుండా కిలోమీటర్ల కొద్దీ మందుబాబులు బారులుతీరిన దృశ్యాలను అంత సులభంగా ఎవరు మర్చిపోగలరు..!