వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా జగన్పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి అంశంపై టీడీపీ విమర్శలు చేస్తుంటే, టీడీపీని అనుసరించి జనసేన, బీజేపీ, కాంగ్రెస్,సీపీఐ పార్టీలు కూడా జగన్ ప్రభుత్వంపై ఏదొరకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్, సీపీఐ పక్కాగా చంద్రబాబు డైరక్షన్లోనే విమర్శలు చేస్తున్నట్లు అర్ధమవుతుంది.
కాంగ్రెస్ పార్టీలో తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ లాంటి వారు జగన్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. తాజాగా సుంకర పద్మశ్రీ జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల్ని కొడతారు, మహిళలని కొడతారు, వలస కూలీలని కొడతారు, ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నుంచో పెడతారు, ప్రశ్నిస్తే దాడి చేస్తారని, ఇది రాజన్న పాలన కాదు ...రౌడీ పాలన అని పద్మశ్రీ ఫైర్ అయిపోతున్నారు. అసలు పద్మ శ్రీ గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంతో పాటు, సీఎం జగన్ను బాగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
కాగా, కమ్మ సామాజికవర్గానికి చెందిన సుంకర పద్మశ్రీ అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమెని టీడీపీలోకి తీసుకొచ్చి జెడ్పీ బరిలో నిలపాలని చూశారు. కానీ ఎందుకో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన పద్మశ్రీ ఎప్పుడొకప్పుడు టీడీపీలోకి రావడం ఖాయమనేది మాత్రం అర్ధమవుతుంది. అందుకే ఆమె ఇప్పటి నుంచే జగన్పై విరుచుకుపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆమె వైఎస్ సీఎం గా ఉన్నప్పుడే 2009లో గన్నవరం కాంగ్రెస్ సీటు ఆశించారు. అయితే వైఎస్ ఆ ఎన్నికల్లో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వర రావుకే సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నా కార్యక్రమాలు అన్ని టీడీపీతో కలిసే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె టీడీపీ లోకి వచ్చి గన్నవరం టీడీపీ అభ్యర్థి అవుతారని టాక్..?