క‌రోనా వైర‌స్‌ మరణాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. తీవ్ర ఒత్త‌డిలో ఉంటున్న వైద్య‌సిబ్బంది చేస్తున్న చిన్న‌చిన్న పొర‌పాట్ల‌తో అయోమ‌యం ఏర్ప‌డుతోంది. నిజానికి.. చాలా రోజులుగా స్పష్టత ఉండటం లేదన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన ఓ ట్రక్‌ డ్రైవర్‌ (70) మరణించగా, డెత్‌ సర్టిఫికెట్‌లో మాత్రం మరణానికి దారితీసిన కారణం గుండెపోటుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఖజౌరి ప్రాంతానికి చెందిన ట్రక్‌ డ్రైవర్‌ మే 4న మరణించగా, మే 2న రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రి నుంచి అతడికి కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. అయితే రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు ఆయన డెత్‌ సర్టిఫికెట్‌లో మరణానికి కరోనా వైరస్‌ను కారణంగా చూపలేదు. కార్డియోపల్మనరీ అరెస్ట్‌ కారణంగా మరణించాడని ఆ డ్రైవ‌ర్‌ మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ సోకినా దాని గురించి ఆస్పత్రి వర్గాలు డెత్‌ సర్టిఫికెట్‌లో చూపక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటో.. బాధితుడు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ట్రక్కులు నడిపే క్రమంలో 2008లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా  తేలినట్టు వెల్లడైంది. మ‌రోవైపు ఇక కరోనా వైరస్‌ సమాచారంలో ఢిల్లీ ప్రభుత్వం గోప్యత పాటిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. చాలా రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో నిష్ప‌క్ష‌పాతంగా వ్యవహరించడం లేదని, క‌రోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడం లేదని, కావాల‌నే పాజిటివ్ కేసులు తక్కువగా చూపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు విషయం తెలిసిందే. కానీ.. ఈ విమ‌ర్శ‌ల‌ను ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కొట్టిపారేస్తున్నారు. ఢిల్లీలో వైర‌స్ వ్యాప్తి నిరోధానికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న అంటున్నారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇప్పుడు ట్ర‌క్ డ్రైవ‌ర్ మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ విష‌యంలో కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. ఇక ఢిల్లీలో కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ 129 మంది మరణించగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 9,333కు పెరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: