ఏపీ రాజకీయాల్లో బాగా మాస్ ఫాలోయింగ్ నేతల్లో మంత్రి కొడాలి నాని ఒకరు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మీద వంటికాలి మీద వెళ్ళే నాయకుడు కూడా నానినే. ఎలాంటి విషయంలోనైనా కాస్త పరుష పదజాలంతోనే బాబు అండ్ బ్యాచ్‌ని ఆడేసుకుంటారు. అందుకే టీడీపీ నేతలు ప్రత్యేకంగా కొడాలిని టార్గెట్‌గా చేసుకుని రాజకీయం చేస్తారు. ముఖ్యంగా కొడాలి ఎప్పుడు దేవినేని ఉమాకు చుక్కలు చూపిస్తుంటారు. కాబట్టి ఉమా ఏదొరకంగా కొడాలి మీద ఆరోపణలు చేసేందుకు చూస్తుంటారు.

 

కొడాలి మంత్రి అయిన దగ్గర నుంచి అయితే ప్రత్యేకంగా ఉమా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఉమా చేసే వ్యాఖ్యలకు కొడాలి కూడా ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చేస్తారు. ఏ మాత్రం మొహమాట పడకుండా, ఘాటైన పదజాలంతోనే రిప్లై ఇస్తారు. ఇక తాజాగా కూడా ఉమా..కొడాలిని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. గుడివాడలోని వలివర్తిపాడు పంచాయతీలో కొడాలి నాని కల్యాణమండపానికి దగ్గరలో ఉన్న స్థలాలన్నీ కబ్జా చేసి.. అక్కడ విల్లా కట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతో పేదలు, సామాన్యుల దగ్గర నుంచి స్థలాలు బలవంతంగా లాక్కొని, అక్కడ టెంట్లు వేసి, రౌడీలను కాపలా పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు.

 

కాకపోతే ఇదే విషయంపై ఆ మధ్య ఓ టీడీపీ అనుకూల మీడియా కూడా కొన్ని కథనాలు ప్రచురించింది. కానీ వీటికి సంబంధించిన ఆధారాలు లేకుండా వారు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక వీటిపై కొడాలి నాని అసలు స్పందించలేదు. మామూలుగానే ప్రభుత్వ పరంగా ఎలాంటి విమర్శలైన ఎదురైనప్పుడు కొడాలి సడన్ ఎంట్రీ ఇచ్చి బాబు, ఉమాలకు గట్టి కౌంటర్లు ఇచ్చేస్తారు.

 

మరి ఇప్పుడు మీడియాలో, ఉమా చేసిన ఆరోపణలపై కొడాలి ఏ రేంజ్ లో కౌంటర్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇలాంటి ఆరోపణలకు స్పందించడం ఎందుకని ఆలోచిస్తారో లేక ఉమా నోరు మూయించడానికి రంగంలోకి దిగుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: