భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో చైనా, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో కుక్క, పిల్లి మాంసం అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే.. కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కుక్క, పిల్లి మాంసం అమ్మకాలను నిలిపివేయాలని కోరుతూ పలు జంతుహక్కుల సంఘాల ప్రతినిధుల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు లేఖ కూడా రాశారు. కుక్క, పిల్లి మాంసాల అమ్మకాలు ప్రజారోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారుతాయని జంతు హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మారెట్లను శాశ్వతంగా మూసివేయాలని ఆ లేఖలో హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, పీపుల్ ఫర్ యానిమల్స్, జెబిఎఫ్ (ఇండియా) ట్రస్ట్, పావ్సోమ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జూనోటిక్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. జంతువుల నుండి ప్రజలకు వ్యాప్తి చెందేవి జూనోటిక్ వ్యాధులు అని అంటారు. రాబిస్, ట్రిచినోసిస్, టైఫస్ ఆంత్రాక్స్ అటువంటి వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకినవేనని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు.
నిజానికి.. భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో కుక్క, పిల్లి మాంసం అమ్మకాలు నిషేధం. కానీ.. కోళ్లు, బాతులు, ఇతర వన్యప్రాణుల జంతువులతో పాట కుక్కలను వధించడం జరుగుతోందని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో జూనోటిక్ వ్యాధులకు కారణమవుతున్న జంతు మాంసం అమ్మకాల మార్కెట్లను శాశ్వతంగా మూసివేయాలని కోరింది. ఈ విషయంలో భారతదేశంతో సహా ఆసియా వ్యాప్తంగా ఉన్నదేశాల ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని హ్యూమన్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్పర్ణ సేన్గుప్తా పేర్కొన్నారు. అయితే.. కుక్క మాంసం విక్రయాలకు కొవిడ్-19తో నేరుగా ఎలాంటి సంబంధం లేకపోవచ్చుగానీ.. ది నిస్సందేహంగా ట్రిచినోసిస్, కలరా, రాబిస్ వ్యాప్తి వంటి వ్యాధులను ప్రబలేలా చేస్తుందని, ఈ వ్యాధులతో ప్రతి సంవత్సరం పదివేల మంది మృతి చెందుతున్నారని సెన్గుప్తా చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.