కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో...అందరి దృష్టి ఇప్పుడు తెలంగాణ సర్కారు ఏం చేయనుందనే ఆసక్తి నెలకొంది. గతంలో కేంద్రం వేళలకు భిన్నంగా గడువు పొడగించిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే సహజమైన ఉత్కంఠ ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
సాయంత్రం కేబినెట్ భేటీ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా కేంద్రంగా కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో వివిధ వర్గాల నుంచి తమకు అనేక సూచనలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని, సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో వీటన్నింటిపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కాగా, ప్రజల నుంచి వచ్చిన వివిధ విజ్ఞప్తుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని కేటీఆర్ పరోక్షంగా తెలియజేశారని పలువురు అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉండగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణాకు అడుగులు పడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరస్పర అంగీకారంతో వాహనాలు, బస్సులు తదితర ప్రజారవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనే తుది నిర్ణయమని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడిపే విషయంపై సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.