గత కొద్దికాలంగా, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న నీటి సమస్యల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. పోతిరెడ్డిపాడుపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తాని సీఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రాల నీటి వాటాలపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ``ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే ప్రాజెక్ట్లు కట్టుకున్నాం. మాకున్న వాటా మేరకు నీళ్లను వాడుకుంటున్నాం. గోదావరి మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రజలకు భంగం కలిగితే మాత్రం ఊరుకునేది లేదు. రాయలసీమ గోదవారి మిగులు జలాలు వాడుకోవచ్చు. కృష్ణా జలాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు.`` అని కేసీఆర్ తేల్చిచెప్పారు. చట్టం పరిధిలో తమ ప్రజలకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి గతంలో ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసని వివాదాలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు.
కాగా, తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ``తెలంగాణ సోనాకు షుగర్ ఫ్రీ రైస్ అని పేరుంది. యాసంగిలో మక్కలు పండించాలి. సన్న రకాల్లో తెలంగాణ సోనా మంచిది. 40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దాం. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలి. నిజామాబాద్, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్ వేసుకోవచ్చు. వరి పంటలో తెలంగాణ సోనా రకం పండించాలని' సీఎం పేర్కొన్నారు.