ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుక విషయంలో చైనా తీరుపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇది సహజంగా పుట్టిన వైరస్ కాదని, జీవాయుధం కోసం చైనా సృష్టించిందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తన ఆధిపత్యం కోసం ప్రత్యర్థి దేశాల మార్కెట్లను దెబ్బతీసేందుకు చైనా దీన్ని వ్యాప్తి చేసిందన్న అనుమానాలూ తలెత్తాయి. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైందని, స్థానికుల ద్వారా వైరస్ వ్యాపించిందన్న వాదనలూ వినిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ కంగా కరోనాను చైనా వైరస్ అని పేర్కొన్నారు. వైరస్ గురించి ముందే తెలిసినా ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్వో విఫలమైందని, చైనాకు తొత్తుగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు విచారణ మొదలైంది.
డబ్ల్యూహెచ్ఏ సమావేశాలు 2 రోజులు ఆన్లైన్లో సాగనున్నాయి. సమావేశాలను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ ప్రారంభించారు. భారత్ సహా వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్ పుట్టుకపై అంతర్జాతీయ దర్యాప్తు జరుపాలన్న వందకుపైగా దేశాల ఒత్తిడి ఫలించింది. కరోనా వ్యాప్తితోపాటు ఈ విశ్వమారిని ఎదుర్కోవడంలో తనపై వచ్చిన విమర్శల మీదా విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంగీకరించింది. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ప్రారంభమైన 73వ ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’ (డబ్ల్యూహెచ్ఏ) సమావేశాల్లో డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ ప్రకటన చేశారు. ‘కరోనా విపత్తు, దానిపై డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, గడించిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై తగిన తరుణంలో మూల్యాంకనానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. పారదర్శకంగా, స్వతంత్రంగా విచారణ చేస్తాం అని ప్రకటించారు. తద్వారా చైనా కథ తేలిపోనుంది.
కాగా, డబ్ల్యూహెచ్ఏను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఈ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడాలంటే.. చికిత్స, వ్యాధి నిర్ధారణ, వ్యాక్సిన్లే మార్గమని చెప్పారు. కరోనా కట్టడికి భారత్ సకాలంలో అవసరమైన అన్ని చర్యలనూ చేపట్టిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారని, వైరస్ నియంత్రణకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదన్నారు. తమ వంతుగా 123 దేశాలకు అత్యవసర మందులను సరఫరా చేశామని అన్నారు. మానవాళి ఏకం కావాల్సిన తరుణం ఇదని పేర్కొన్న కేంద్రమంత్రి అంతర్జాతీయ సహకారం అత్యవసరమని, అన్ని వనరులు వినియోగించుకుని, ఫలితాలు అందరికీ అందేలా చూడాలని అన్నారు.