తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలపై క్లారిటీ వచ్చింది. కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఎనిమిది పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర హైకోర్టు పదో తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను నిలిపివేస్తూ మార్చి 20న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకొన్నది. జూన్3వ తేదీన కరోనా పరిస్థితులను మరోసారి సమీక్షించుకొని పరీక్షలపై ముందుకెళ్లాలని సూచించింది. తప్పనిసరి అనుకొంటే వాయిదా వేయవచ్చని కూడా పేర్కొన్నది. దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సామాన్యవిషయం కాదని, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని స్పష్టంచేసింది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన విద్యార్థులనుంచి తొలిగించాల్సిన అవసరమున్నదని తెలిపింది. ఇప్పటికే.. పదో తరగతికి సంబంధించి ఇప్పటికే రెండు పరీక్షలు పూర్తయ్యాయి.
మిగిలిన వాటిలో ఇంగ్లిష్, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు 2 పేపర్ల చొప్పున 8 ఉంటాయి. ప్రతి పరీక్షకు మధ్య 2 రోజుల విరామం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆదివారాలు కలుపుకుంటే 3 పరీక్షలకు 3 రోజులు విరామం వస్తుంది. మిగిలిన 5 పరీక్షలకు 2 రోజులు విరామం ఉంటుంది. ఓఎస్ఎస్సీ పరీక్షలకు మరో ఆదివారం అదనంగా వస్తుంది. ఆదివారాలలో కూడా పరీక్షలు నిర్వహిస్తే, 8 ప్రధాన పరీక్షలు జూన్ 8 నుంచి 29 వరకు పూర్తవుతాయి. ఆదివారం సెలవుగా పరిగణిస్తే మరో 4 రోజులు అదనంగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పుమేరకు ప్రతిపాదిత టైంటేబుల్ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతున్నామని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదిత టైంటేబుల్, జూన్ 8 ఇంగ్లిష్ పేపర్ -1, జూన్ 11 ఇంగ్లిష్ పేపర్ -2, జూన్ 14 గణితం పేపర్-1, జూన్ 17 గణితం పేపర్-2, జూన్ 20 సామాన్యశాస్త్రం -1, జూన్ 23 సామాన్యశాస్త్రం-2, జూన్ 26 సాంఘికశాస్త్రం -1, జూన్ 29 సాంఘిక శాస్త్రం-2 , జూలై 2 ఓఎస్ఎస్సీ పేపర్ -1, జూలై 5 ఓఎస్ఎస్సీ పేపర్-2, జూలై 8 ఎస్సెసీ ఒకేషనల్ థియరీ.