భారత్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. నిన్నటితో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షమార్క్ను దాటాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరుకోవడానికి 64 రోజులు పట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్యశాఖ, వరల్డో మీటర్స్ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కేసులు కేవలం 25 రోజుల్లో 100 నుంచి లక్షకు చేరాయి. ఇక భారత్లో ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 7.1 కరోనా కేసులు రికార్డయితే, ప్రపంచ వ్యాప్తంగా అది 60 కేసులుగా ఉంది. భారత్లో ప్రతి లక్ష మందికి 0.2 మంది మరణిస్తుండగా, అది ప్రపంచ వ్యాప్తంగా 4.1గా ఉంది. వైరస్ పుట్టిన చైనాలో (0.3) కంటే భారత్లో మృతుల రేటు తక్కువ. స్పెయిన్లో అత్యధికంగా ప్రతి లక్ష మందికి 59.2 మృతుల రేటు ఉండగా, ఇటలీలో 52.8, బ్రిటన్లో 52.1, ఫ్రాన్స్లో 41.9, అమెరికాలో 26.6గా నమోదైంది.
కాగా, భాతరదేశవ్యాప్తంగా సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో 4,970 పాజిటివ్ కేసులు రికార్డుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1,01,139కి చేరుకున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 34 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 3163కు చేరుకున్నది. అయితే.. భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదు కావడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. వేగంగా పాజిటివ్ కేసులు నమోదుకాకపోవడానికి భారత్ పాటిస్తున్న లాక్డౌన్ కారణమని ఇప్పటికే ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో కేవలం 25 రోజుల్లోనే లక్ష కేసులు నమోదు అయితే.. భారత్లో లక్ష కేసులు నమోదు కావడానికి 64రోజుల సమయం పట్టింది. అంటే భారత్లో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.