కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందంజలో నిలుస్తోంది. లాక్డౌన్ అమలులో, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఏపీ సర్కార్ దేశంలోనే టాప్లో నిలుస్తోంది. రోజుకు సగటున సుమారు 10వేల నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే కేవలం 30 నుంచి 40వరకు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని అనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. వేగంగా నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడే వైరస్ వ్యాప్తిని తొందరగా కట్టడి చేయగలుగుతామని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 2,58,450 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 2,489 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) 9,739 శాంపిల్స్ను పరీక్షించగా.. 57 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్థారించినట్లు తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో ఒకటి.. మొత్తంగా 6 కేసులు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబేడు నుంచి వచ్చినవే. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 69 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం 2,489 పాజిటివ్ కేసులకు గాను 1,621 మంది సంపూర్ణంగా కోలుకొని వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 816 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా చిత్తూరులో ఒకరు, కర్నూలులో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.96 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 65.13 శాతంగా ఉంది. ఇవి చాలా మంచిపరిణామాలని నిపుణులు చెబుతున్నారు.