కరోనా కలకలం నేపథ్యంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన సడలింపులను సద్వినియోగం చేసుకుంటూ... ఎవరికివారు అప్రమత్తంగా వ్యవహరిస్తే వైరస్ వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు చెప్తున్నారు. కరోనా వైరస్ సోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వైద్య విభాగాలు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు విధిగా భౌతికదూరం పాటిస్తే కరోనా దరిచేరదని సూచిస్తున్నారు.
కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతపై దృష్టి పెట్టాలని స్పష్టం చేస్తున్నారు. సబ్బు లేదా శానిటైజర్ లేదా హ్యాండ్వాష్ లిక్విడ్తో తరచూ చేతులను కడుక్కోవాలని సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని పేర్కొంటున్నారు. మార్కెట్లు, పనిచేసే ప్రాంతాల్లో, ప్రయాణాలు, ఇతర సందర్భాల్లో భౌతికదూరం తప్పనిసరి అని వైద్య నిపుణులు తేల్చిచెప్తున్నారు. కొత్తవారితో మాట్లాడేటప్పుడు 6 అడుగుల దూరంలో ఉండాలని కోరుతున్నారు.
అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇల్లు వదిలి బయటకు రాకపోవడమే ఉత్తమని వివరిస్తున్నారు. బీపీ, షుగర్, గుండె, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నవారు, క్యాన్సర్ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు వెల్లడించారు. ఏ మాత్రం నలతగా ఉన్నా, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలుంటే తక్షణం వైద్యుడిని సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిసినవారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో నివసించేవారు, అక్కడికి వెళ్లి వచ్చినవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా, మాస్కు లేకపోతే నిత్యావసర సరుకులను విక్రయించకూడదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని అన్ని దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కొనుగోలుదారులు మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని కమిషనర్లను ఆదేశించారు. దుకాణాల వద్ద శానిటైజర్లను ఏర్పాటుచేయాలన్నారు.