తెలంగాణ సీఎం కేసీఆర్తో పెట్టుకుంటే బతికి బట్టకట్టే పరిస్థితి ఉందా ? అంటే ఈ మాట అర్థం ఆయన ముందు రాజకీయంగా ఎదిరించి రాజకీయం చేసే పరిస్థితి తెలంగాణలో ఉందా ? అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన యేడాది నుంచి ఆయన అసలు సిసలు రాజకీయం మొదలు అయ్యింది. అసలు తెలంగాణలో ప్రతిపక్షం అనే పదం లేకుండా చేసుకుంటూ వచ్చేశారు. ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో అసలు కమ్యూనిస్టులు.. తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేసుకుంటూ వచ్చేశారు. ఇక రెండో టర్మ్లో కేసీఆర్ను గద్దె దించేందుకు ఇక్కడ టీడీపీ... కాంగ్రెస్... కోదండరాం లాంటి వాళ్లు ఒక్కటి అయ్యారు.
అయినా కేసీఆర్ రెండోసారి ఘనవిజయం తో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణ కు వరుసగా రెండో సారి సీఎం అయిన ఘనత సొంతం చేసుకున్నారు. ఇక రెండోసారి సీఎం అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీని పూర్తి గా మటాష్ చేసి పడేశారు. అసలు ప్రతిపక్షం అనే పదం కూడా తెలంగాణ లో ఎక్కడా వినపడడం లేదు. అలాంటిది ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తీసుకున్న పోతిరెడ్డి పాడు జీవో వివాదం తెలంగాణ లో ప్రతిపక్షాలకు ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. ఈ విషయంలో తెలంగాణ కృష్ణాబోర్డుకు కంప్లయింట్ కూడా ఇచ్చింది.
నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టీ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇలా ఒక్కొక్కరు ఇప్పుడు కేసీఆర్ పై తీవ్ర స్తాయిలో విరుచుకు పడుతున్నారు. కోమటిరెడ్డి అయితే వైఎస్ కంటే జగనే తెలివైన వాడని విమర్శలు చేస్తున్నారు. ఇక రేవంత్ అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యాకే ఈ జీవో వచ్చిందని అంటున్నాడు. ఈ ఇద్దరు ప్రగతి భవన్ లో భేటీ అయ్యి ఏం చర్చించుకున్నారో అవి బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఈ వరుస ఆరోపణలతో టీఆర్ఎస్ మంత్రులు కూడా స్థానికంగా జిల్లాల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వక పోతే ఇబ్బంది వచ్చేలా ఉంది. ఏదేమైనా ఇక్కడ జగన్ ఇచ్చిన చిన్న జీవో అక్కడ కేసీఆర్, టీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ విపక్షాలకు మంచి బూస్టప్ అయితే ఇచ్చింది.