ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ . రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా జన్మనిచ్చిన ఎంతో మంది నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. జాతీయ స్థాయిలోనూ కీలక పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి నుంచి ఇటు ఏపీలో మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ మాట ఇచ్చి ఎంతో మంది సామాన్య కార్యకర్తలను కూడా ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా చేశారు. ఇక ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం తన పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు.
ఇక జగన్ను నమ్ముకుని పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్న ఎంతో మంది నేతలు ఈ రోజు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అయ్యారు. అంతెందుకు ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా ఉన్న ఎంతో యువ నేతలకు జగన్ ఇచ్చిన లైఫే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లంతా జగన్ వేవ్ లో ఎమ్మెల్యేలు అయ్యారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులను సైతం చిన్న వయస్సులోనే చట్ట సభల్లోకి తీసుకు వెళ్లిన ఘనత జగన్దే అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో యువ నేతను సైతం జగన్ చట్టసభల్లోకి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. ఆ యువనేత ఎవరో కాదు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్.
అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ప్రస్తుత మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో అవినాష్ చంద్రబాబు మాటలు నమ్మి ఆర్థికంగా కూడా నష్టపోయారు. ఆ వెంటనే జగన్ వైసీపీలో చేరిన వెంటనే అవినాష్కు నగరంలో కీలకమైన తూర్పు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి తన నియోజకవర్గంలో వైసీపీని పరుగులు పెట్టిస్తోన్న అవినాష్ ఇప్పటికే అక్కడ వరుసగా గెలుస్తోన్న గద్దె రామ్మోహన్ దూకుడుకు దాదాపుగా బ్రేకులు వేశారు. మరో యేడాది అయితే అవినాష్ విజయవాడ నగరంలో తిరుగులేని నాయకుడు అవుతాడని... భవిష్యత్తు విజయవాడ పొలిటికల్ తెరపై అవినాష్కు మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక జగన్ సైతం అవినాష్కు మంచి ప్రయార్టీ ఇస్తున్నారు. తాజాగా బుధవారం కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్, ఏపి క్రెడాయ్ రూ. 1,00,00,000/- విరాళం సీఎం జగన్ను కలిసి ఆయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపి ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఎం. మురళి, అక్కయ్య నాయుడు, ప్రకాష్, సుధాకర్, రాంబాబు, పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ అవినాష్ను బుజం తట్టి మెచ్చుకోవడంతో పాటు నియోజకవర్గంలో బాగా పని చేస్తున్నావని మెచ్చుకున్నట్టు సమాచారం. ఇక అవినాష్ పార్టీలో చేరిన రోజునే తమ్ముడు నిన్ను ఎమ్మెల్యేను చేసే బాధ్యత నాది అని చెప్పి దూసుకుపొమ్మని చెప్పారు. అప్పటి నుంచి తూర్పులో అవినాష్ పార్టీని సంస్థాగతంగా తిరుగులేని విధంగా బలోపేతం చేసుకుంటూ వచ్చారు.