తిరుమల వెంకన్న భక్తులకు లాక్ డౌన్ కారణంగా దర్శనాలు కరువయ్యాయి. ఆయన దర్శనానికి మళ్లీ ఎప్పుడు అనుమతిస్తారా అని భక్తులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో తిరుమల ఆలయంపై కొన్ని కథనాలు వచ్చాయి. లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీనివాసుని ఆదాయానికి గండిపడిందని.. ఈ లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే టీటీడీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమేనంటూ ప్రముఖ పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి.

 

 

అయితే ఈ లాక్ డౌన్ లో టిటిడి ఆదాయ పరిస్థితిపై ఆ సంస్థ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. టీటీడీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ వద్ద అవసరమైన నిధులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు.. ఎవరూ అపోహలు పడొద్దని సూచించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని, ఈ ఏడాది దర్శనాలు లేకపోయినా ఆదాయం రూ.1.98 కోట్లు వచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

 

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా స్వామివారి దర్శనాలను నిలిపివేశామని, తిరిగి దర్శనాలు ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాలు కల్పించలేకపోయినా.. కనీసం స్వామివారి ప్రసాదమైనా భక్తులకు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

 

 

అందుకే.. రూ. 50 లడ్డూ రూ.25కే భక్తులకు అందించే చర్యలు చేపడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. మరో రెండు రోజుల్లో ప్రసాదాల పంపిణీ ప్రక్రియ అమలు చేస్తామని ఆయన చెప్పారు. అన్ని జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. లడ్డూ, ప్రసాదాలు కావాల్సిన వారు ఆలయ అధికారి, పోటు అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: