ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో కరోనా కేసుల రికవరీ రేటు పెరుగుతోంది. ప్ర‌స్తుతం 65.08 శాతంగా ఉంది. బుధవారం 43 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు మొత్తం కరోనాను జయించిన వారి సంఖ్య 1,664గా ఉంది. ఇంకా యాక్టివ్‌ కేసులు 843 ఉన్నన్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 9,159 మందికి పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. వీటిలో కోయంబేడుకు సంబంధించిన కాంటాక్టు కేసులు 10 ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 2,560కి చేరగా.. వీరిలో వలస కూలీలు 153 మంది ఉన్నారు.  రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ రేటు కేవ‌లం 0.96గా ఉంది. అంటే.. దాదాపుగా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం కూడా ఉంది.. రాష్ట్రంలో మే నెలలో పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే వెరీయాక్టివ్‌ క్లస్టర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

 

తాజా కేసుల నమోదును బట్టి చూస్తే 16వ తేదీ నుంచి వెరీయాక్టివ్‌ క్లస్టర్ల సంఖ్య తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట 56 క్లస్టర్లుగా ఉన్న ఈ సంఖ్య.. బుధవారం నాటికి 50కి తగ్గింది. వెరీయాక్టివ్‌ క్లస్టర్లంటే.. ఒకటి నుంచి ఐదు రోజుల్లోగా కేసులు నమోదైనవి. వీటిని రెడ్‌ జోన్‌లో ఉన్న క్లస్టర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న కేసుల్లో ఎక్కువగా కేంద్రీకృతంగా.. అంటే వచ్చిన ప్రాంతాల్లోనే మళ్లీ కేసులు వస్తున్నాయన్నమాట. కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరించకపోవడమంటే రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ నియంత్రణ చర్యలు బాగుండ‌డం వ‌ల్లే సాధ్య‌మైంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 28 రోజులు దాటినా కేసులు నమోదు కాని క్లస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరగడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చున‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌లు.. వేగ‌వంతంగా ప‌రీక్ష‌లు చేయ‌డం వ‌ల్లే.. క‌రోనాపై ప‌ట్టుసాధించార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: