పొట్ట చేతపట్టుకొని భార్యాబిడ్డలతో కలిసి బతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు నలభై రోజుల పాటు నరకం అనుభవించారు. చేద్దామంటే పనిలేదు.. తమ సొంత ఊరికి వెళ్తామంటే పరిమిషన్ లేదు.. లాక్ డౌన్ తో వలస జీవుల జీవిన శైలి అస్తవ్యస్థం అయ్యింది. లాక్ డౌన్ తో రాష్ట్రంలో లక్షలాది మంది వలస జీవులకు ఉపాధి పోయింది. బతుకు బండి నడవలేదు..పూట గడవడం కష్టమైంది.. దీంతో మూట ముల్లె సర్దుకున్నారు. లారీల్లో కొందరు.. సైకిళ్లపై కొందరు..నడుస్తూ కొందరు.. సొంత ఊళ్లకు బయలుదేరారు. ఇప్పటికే చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. మరికొంత మంది సరిహద్దుల్లో, షెల్టర్లలో గడుపుతున్నారు. అయితే తాము నివసించే ప్రదేశాలు రెడ్ జోన్లో ఉండటంతో కొంత మంది వలస కార్మికులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. అంతే కాదు వలస కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వాహనాలపై వెళుతుండటాన్ని చూసిన పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.
దీంతో వలస కూలీలు తమ గ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తున్నారు. ప్రధాన రహదాల మీదుగా కాకుండా పట్టణాల్లోని గ్రీన్ జోన్లు ఎక్కడ ఉన్నాయి.. అక్కడ జనసందోహం ఉండటంతో ఆ మార్గాలను వెతుక్కొని మరీ కాలినడకన ప్రయాణాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, రాజస్థాన్ల నుండి వస్తున్న వలస కూలీలు యూపీలోని షాహీద్ నగర్, రాజీవ్నగర్, భోపురాలలోని అంతర్గత రోడ్ల ద్వారా తమ గ్రామాలకు వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నారు.
ఇక్కడ కూడా వారిని దరిద్రం వెన్నాడుతూనే ఉంది.. ఈ మార్గాల్లోనూ పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కు పంపిస్తున్నారు. కూలీలు బరువెక్కిన హృదయంతో సొంత గూటికి వెళ్లడానికి నానా కష్టాలు పడుతున్నారు. కాగా, లాక్డౌన్ అనౌన్స్ చేసిన వెంటనే 6 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లి పోయారు. ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. మరోవైపు కరోనా కష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయని వాపోతున్నారు వలస కార్మికులు.