వ్యాక్సిన్ లేకున్నా ఫర్వాలేదు. కరోనా రాకుండా చేసే మందు కనుక్కున్నామని చెబుతోంది చైనా. ఈ మందుపై నిర్వహించిన పరీక్షలు సక్సెస్ అయ్యాయని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఔషధం అందుబాటులోకి వస్తే.. కరోనాకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు.
కరోనాకు మందు కనుక్కునే రేస్లో ముందుకు ఉరుకుతోంది చైనా. ప్రపంచం మొత్తానికి వైరస్ అంటించిన పాపాన్ని కడుక్కునేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. తాజాగా చైనా కనుక్కున్న మందు వేసుకుంటే కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదంటున్నారు. తాజాగా పెకింగ్ యూనివర్సిటీ కనుక్కున్న మందు వేసుకుంటే వైరస్ సోకిన వారు వేగంగా కోలుకోవడమే కాకుండా.. వైరస్ సోకని వారికి .. కరోనా వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు.
జంతువులపై ప్రయోగించిన ఈ ఔషధం సక్సెస్ఫుల్గా పని చేసిందని పెకింగ్ యూనివర్సిటీ డైరెక్టర్ సన్నీ జీ చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలో నుంచి తీసిన కణాలతో తయారు చేసిన ఈ ఔషధం ప్రయోగించిన తర్వాత.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ.. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే కణాలను అదుపు చేసినట్లు సైంటిస్టులు గుర్తించారు.
పెకింగ్ యూనివర్సిటీ కనుక్కున్న మందు.. మరో ఏడాది లోపు అందరికీ అందుబాటులోకి తెస్తామని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో గినియా పందుల మీద దీన్ని ప్రయోగిస్తున్నారు. ఏక కణం ద్వారా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ ఔషధంలో ఉన్న గొప్ప లక్షణం అని పెకింగ్ యూనివర్సిటీ చెబుతోంది. కరోనాను నియంత్రించేందుకు ఇప్పటికే చైనాలో ఐదు రకాల ఔషధాలు మనుషుల మీద ప్రయోగ దశలో ఉన్నాయి. మొత్తానికి చైనా వైద్యులు కరోనాకు విరుగుడు కనుక్కొనే పనిలో బిజీగా ఉన్నారు. అదే కానీ వస్తే ఇక కరోనాకు అంతమేనంటున్నారు.