కరోనా కలకలం, లాక్ డౌన్తో దేశవ్యాప్తంగా దాదాపు 50 రోజుల పాటు ప్రజా జీవితం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ప్రజలు ఇంటిలో నుంచి కదలలేని పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో వారు మునుపెన్నడూ రుచి చూడని జీవిత అనుభవాలను అనుభవించారు. అలాంటి ప్రత్యేక సందర్భాల గురించి తాజాగా విడుదలైన ఓ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఫీసులు, మాల్స్, స్కూల్స్, కాలేజీలు, మల్టిఫ్లెక్స్లు, పబ్స్, రెస్టారెంట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసులు మూతపడటం, ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసేయడంతో...ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. లాక్డౌన్లో జనాలు ఉప్పు, పప్పులు ఎక్కువగా కొన్నారట. మామూలుగా చేసే బిల్లు కంటే లాక్డౌన్ రోజుల్లో బిల్లులు ఎక్కువయ్యాయట.
లాక్ డౌన్ నేపథ్యంలో బయట ఫుడ్ దొరకక పోవడంతో ఇంట్లోనే వంట తప్పనిసరి అయింది. దీంతో వివిధ రకాల వెరైటీలు చేసుకుంటున్నారట. అందుకే 5కేజీల నూనె డబ్బాలు, కేజీ నెయ్యి ప్యాకెట్లు ఎక్కువగా అమ్ముడు పోయాయని వ్యాపారులు చెప్పారు. వాటితో పాటు కూల్డ్రింక్స్, చిప్ప్ ప్యాకెట్లు కూడా పెద్ద మొత్తంలో కొనుకున్నారని చెప్పారు. మార్చిలో బిల్లు సైజ్ ఒక్కసారిగా రెండింతలు అయిందని చెప్పారు. వీటిలో నిత్యావసర వస్తువులు, శానిటైజర్స్, ఫ్లోర్ క్లీనర్స్ కు గిరాకీ బాగా పెరిగింది. కరోనా కాలంలో పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు అందరూ ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కస్టమర్ బిల్ సైజ్ మామూలు కంటే సగటున 1.5 రెట్లు పెరిగిందని, మార్చిలో యావరేజ్ బిల్లు రూ.650 కాగా.. ఏప్రిల్కి ఆ బిల్లు రూ.వెయ్యికి పెరిగింది. ప్రస్తుతం అది రూ.900కి చేరింది. మళ్లీ మళ్లీ బయటకు రాకుండా ఒకేసారి కొనుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ప్యాకెట్లనే ఎక్కువగా కొనుకున్నారని స్టోర్స్ నిర్వాహకులు చెప్పారు.
ప్రముఖ ఆహరోత్పత్తుల సంస్థ ఐటీసీ ప్రతినిధి హేమంత్ మాలిక్ తాజా ట్రెండ్ గురించి స్పందిస్తూ బిస్కెట్లు, నూడిల్స్, చాక్లెట్లు లాంటివి ఎక్కువగా.. పెద్ద ప్యాకెట్లు కొన్నారని, లిమిటెడ్ టైమింగ్స్ వల్ల ఒకేసారి అన్ని కొనేసుకున్నారని చెప్పారు. స్పెన్సర్స్ సీఈవో దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ “ వినియోగదారుల కొనుగోలు బిల్లు ప్రతిసారి కంటే ఈ సారి 1.5 పెరిగింది. పెద్ద ప్యాకెట్లను ఎక్కువగా కొనుకున్నారు. స్టోర్లలో స్టాక్ ఉండదనే ఉద్దేశంతో ఒకేసారి కొనేసుకున్నారు” అని వివరించారు.